రాజన్న సిరిసిల్ల, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నది. ఏప్రిల్ 4 నుంచి మే 15వరకు జాబితా సిద్ధం చేయాలని ఈ నెల 24న రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.. 2013 తర్వాత సహకార సంఘాల ఎన్నికలు జరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చేనేత సహకార సంఘాల్లో సందడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా చేనేత సహకార సంఘాల ఎన్నికలు 2013 ఫిబ్రవరిలో చివరిసారిగా జరిగాయి. పాలకవర్గాల కాలపరిమితి 2018 ఫిబ్రవరిలో ముగిసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 334 వరకు సొసైటీలు ఉండగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో 29 చేనేత , ఆరు పవర్లూమ్ సొసైటీలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. చేనేతతోపాటు మరమగ్గాల సహకార సంఘాలకు సైతం ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 4 నుంచి 13 వరకు బకాయిదారుల జాబితాను సంఘం కార్యాలయ నోటీస్ బోర్డుపై ప్రచురించనున్నారు. ఓటుహక్కు కావాలనుకుంటే సహకార సంఘానికి బకాయిలను ఏప్రిల్ 13లోగా చెల్లించాలని గడువు విధించారు. ఏప్రిల్ 15 నుంచి 17వరకు చేనేత జౌళిశాఖ అధికారులు సహకార సంఘాల వారీగా ఓటరు జాబితా తయారు చేస్తారు.
18 నుంచి 25 వరకు సహకార సంఘాల నోటీస్ బోర్డులపై జాబితా ప్రదర్శిస్తారు. 27 నుంచి 29 వరకు సభ్యుల నుంచి అభ్యంతరాల స్వీకరణ. 30 నుంచి మే 1 వరకు సంఘాల వారీగా జాబితాను జిల్లా రిజిస్ట్రార్కు అందజేస్తారు. మే 2 నుంచి 5 వరకు జిల్లా ఏడీ కార్యాలయంలో ఓటరు జాబితా పరిశీలిస్తారు. 6 నుంచి 8 వరకు సంఘం నోటీస్ బోర్డుపై సవరించిన జాబితా ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 12వ తేదీ నాటికి సవరించిన ఓటరు జాబితాను జిల్లా ఏడీ కార్యాలయంలో అందజేస్తారు. 13 నుంచి 15 వ తేదీ వరకు రాష్ట్ర కోఆపరేటివ్ ఎన్నికల సంఘానికి ఓటరు జాబితా అందజేయనున్నారు.