హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ‘పేదోళ్లు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ దవాఖానలకు వస్తారు. వారికి రూపాయి కూడా భారం పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివెళ్లేలా చేయడం మన కర్తవ్యం’.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానం ఇది. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నది. సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తున్నది. పల్లె నుంచి పట్నం దాకా అన్ని స్థాయి దవాఖానల్లో వైద్య సదుపాయలను మెరుగు పరిచింది. వ్యాధి ముదరక ముందే నయం అవుతూ.. వారికి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నది.
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ప్రాథమికంగా వైద్యం అందించే పీహెచ్సీలు, సబ్ సెంటర్లను ప్రభుత్వం బలోపేతం చేసింది. ఇందులో భాగంగా రూ.67 కోట్లతో 43 కొత్త పీహెచ్సీ భవనాలను నిర్మిస్తున్నది. రూ.43 కోట్లతో 372 పీహెచ్సీల మరమ్మతులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.247 కోట్లతో 1,239 సబ్ సెంటర్లకు భవనాలు నిర్మిస్తున్నది. 1,497 సబ్ సెంటర్ భవనాలను రూ.60 కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నది. 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించింది. బస్తీ దవాఖానల స్ఫూర్తితో గ్రామాల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 4,745 సబ్ సెంటర్లను ‘పల్లె దవాఖాన’లుగా అభివృద్ధి చేస్తున్నది. వీటిలో మిడ్ లెవల్ హెల్త్ వర్కర్లను నియమిస్తున్నది. పారిశుద్ధ్య నిర్వహణను మెరుగు పరిచేందుకు శానిటేషన్ బడ్జెట్ను ఒక్కో బెడ్కు రూ.5,000 నుంచి రూ.7,500కు పెంచింది. రోగులకు ఇచ్చే డైట్ చార్జీలను రోజుకు రూ.40 నుంచి రూ.80కి పెంచింది.
పట్టణ పేదలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలను అందించే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్లో 256 బస్తీ దవాఖానలను ప్రభుత్వం నెలకొల్పింది. వీటి స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ఆదేశాలతో 141 మున్సిపాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఇవి ఏటా లక్షల మందికి వైద్యం అందిస్తూ.. ఓ వైపు పేదలకు డబ్బులు మిగల్చడంతోపాటు మరోవైపు సూపర్ స్పెషాలిటీ దవాఖానలపై భారం తగ్గించాయి. వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం టీ డయాగ్నోస్టిక్స్ను ప్రారంభించింది. 57 రకాల రోగనిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నది. కిడ్నీ బాధితుల సౌలభ్యం కోసం నియోజకవర్గానికి ఒక డయాలసిస్ సెంటర్ లక్ష్యంతో 102 ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 21 దవాఖానల్లో సీటీ సాన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గుండె సంబంధిత శస్త్ర చికిత్సల కోసం హైదరాబాద్తోపాటు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్లలో క్యాథ్ ల్యాబ్లను ఏర్పాటు చేసింది.