రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు.. సరిపడా బస్సులు నడపడం లేదని ఆర్టీసీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ ఎదుట అందోళనకు దిగారు. రెండు గంటలకు పైగా వేచిచూసినా బస్సులు రాలేదు. వచ్చిన బస్సుల్లో రద్దీ అధికంగా ఉండటంతో ఆగ్రహానికి గురై ఆర్టీసీ అధికారులను నిలదీశారు. బస్సులో సీట్ల కోసం వరంగల్కు చెందిన రెండు కుటుంబాల మధ్య గొడవ తలెత్తి పోలీస్స్టేషన్ వరకు వెళ్లింది. ఇప్పటికైనా వేములవాడకు సరిపడా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.
-వేములవాడ రూరల్
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన గుర్తింపుకార్డుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో కండక్టర్లు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా ‘మహాలక్ష్మి కార్డు’ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను ఆర్టీసీ అధికారులు రూపొందిస్తున్నారు.
జీరో టికెట్ విషయంలో కొందరు కండక్టర్ల అత్యుత్సాహంపై ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఉచిత ప్రయాణానికి ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించాలన్న నిబంధనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడన్నీ డిజిటలైజ్ కాబట్టి ఫోన్లలోని కార్డులను చూపించినా అనుమతించాలని ప్రయాణికులు గొడవకు దిగుతున్నారు. కొందరు జిరాక్స్ కాపీలను తీసుకెళ్తున్నా కండక్టర్లు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్పెట్టేలా శాశ్వతంగా ఓ కార్డును తీసుకురావాలని ఆర్టీసీ యోచిస్తున్నది. కార్డు ఎలా ఉండాలి? ఏం పేరు పెట్టాలి? అన్నదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
మహిళలకు ప్రయాణం ఉచితం కావడంతో బస్సుల్లో పురుషులకు సీట్లు లభించడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురుషులకు బస్సుల్లో 20 శాతం సీట్లు కేటాయిస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా అధికారులు చర్చిస్తున్నారు. గతంలో కర్ణాటకలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పురుషుల కోసం వారం రోజులపాటు ప్రత్యేకంగా బస్సులు నడిపినా వాటికి అంతగా అదరణ లభించలేదు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. త్వరలోనే ఆర్టీసీకి కొత్తబస్సులతోపాటు అద్దె బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయని, అవి రాగానే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు.
ఎక్కువమంది ప్రయాణికులను తీసుకెళ్తే డ్రైవర్, కండక్టర్కు యాజమాన్యం నజరానాలు ప్రకటించడంతో కొందరు కండక్టర్లు జీరో టికెట్లను ఎక్కువకొట్టి లెక్క పెంచుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ జంటనగరాల్లో 2,850 బస్సులు ఉన్నాయి. సీట్లలో 60శాతం మహిళలతో నిండిపోతున్నాయి.