హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం టీ డయాగ్నోస్టిక్స్ను ప్రారంభించింది. 57 రకాల రోగానిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 20 తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ లు సేవలందిస్తున్నాయి. మిగతా జిల్లాల్లో పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆటో అనలైజర్ లు, డిజిటల్ ఎక్స్-రేలు, అల్ట్రాసౌండ్ సాన్ మెషీన్ లు, 2-డి ఎకో, మామోగ్రామ్, హై ఎండ్ డయాగ్నస్టిక్ పరికరాలు ఈ హబ్లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో పీహెచ్సీలు మొదలు అన్ని స్థాయిల దవాఖానలను టీ డయాగ్నోస్టిక్స్కు అనుసంధానం చేసింది. దీంతో పేదలు అటు చికిత్సకు, ఇటు వ్యాధి నిర్ధారణకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. అన్ని దవాఖానల్లో ఓపీ, ఐపీ పేషంట్లకు కలిపి ఇప్పటివరకు 1,50,91,872 మందికి టెస్టులు నిర్వహించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 42,33,046 మంది లబ్ధి పొందారు. ఇందుకోసం ప్రభుత్వం చేసిన ఖర్చు 233.8 కోట్లు.
గుండెపోట్లను వెంటనే గుర్తించి చికిత్స అందించేందుకు స్టెమీ కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం, రిమ్స్ ఆదిలాబాద్, ఖమ్మంలో క్యాథ్ల్యాబ్లను ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటు కోసం ప్రభుత్వం పదుల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. వీటితోపాటు 74 ఉప కేంద్రాల ద్వారా ఈసీజీలు తీస్తున్నారు. ఇప్పటివరకు సుమారు రెండులక్షలకుపైగా ఈసీజీలు తీశారు. రాష్ట్రంలోని 27,500 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించే కార్యక్రమం గతేడాది పూర్తయింది. ప్రభుత్వ, ప్రైవేటులో ఆరోగ్య శ్రీ కింద గతేడాది 2.59 లక్షల మంది రోగులు లబ్ధి పొందారు. ఎంప్లాయ్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ సీం కింద 43,702 మంది లబ్ధిపొందారు.
మానవతకు మారుపేరైన సీఎం కేసీఆర్ గారి ఆలోచన మేరకు క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులతో అవసాన దశకు చేరిన పేషంట్ల కోసం ప్రభుత్వం పాలియేటివ్ కేర్ చేపట్టింది. వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ, చివరి రోజులను ప్రశాంతంగా గడిపేందుకు ఈ కేంద్రాలు సేవలందిస్తాయి. ఇప్పటివరకు 33 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు మొత్తం 168 ఉండగా వాటిలో ఐదో వంతు తెలంగాణలోనే ఉన్నాయి.
రోగాలను ముందుగా గుర్తించి, తద్వారా చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్రంలో ఎన్సీడీ స్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నది. గతేడాది చివరి నాటికి 1.48 కోట్ల మందికి స్రీనింగ్ జరిగింది. ఇందులో 17.36 లక్షల మందికి బీపీ, 8.86 లక్షల మందికి షుగర్ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. వారందరికి ఉచితంగా ప్రభుత్వం మందుల కిట్లను (ఎన్సీడీ కిట్లు) ఆశా, ఏఎన్ఎంల ద్వారా ఇంటికే పంపిణీ చేస్తున్నది. జిల్లా, సీహెచ్సీల్లో ప్రత్యేకంగా ఎస్సీడీ క్లినిక్స్ ఏర్పాటు చేసింది. వీటిల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా పరికరాలను అందుబాటులో ఉంచింది.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడుసార్లు డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ వ్యాధి వారిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తుంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉస్మానియా, గాంధీ, నిమ్స్లో మాత్రమే ఉచిత డయాలసిస్ సెంటర్లు ఉండేవి. రోగులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ ఈ సమస్యను మానవతా హృదయంతో ఆలోచించి ప్రతి నియోజకవర్గానికి ఒక ఉచిత డయాలసిస్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో డయాలసిస్ కేంద్రాల సంఖ్యను 3 నుంచి 102 కు పెంచారు. రాష్ట్రంలో దాదాపు 12వేల మంది డయాలసిస్ చేయించుకుంటుంటే, వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్ చేయించుకుంటున్నారు.
దేశంలో ఎకడా లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ను ఉపయోగించి డయాలసిస్ చేస్తున్నారు. డయాలసిస్ రోగులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛను, ఉచిత బస్ పాస్ ఇస్తున్నారు. ఏటా 150 వరకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చేయిస్తున్నారు. వీటికి కార్పొరేట్ దవాఖానల్లో రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా కిడ్నీ రోగుల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇందులో డయాలసిస్ రోగుల కోసమే రూ.100 కోట్లు ఖర్చు ఖర్చు చేస్తున్నది. 2022 వరకు 67,049 మంది రోగులు డయాలసిస్ చేయించుకోగా, ప్రభుత్వం రూ.698.08 కోట్లు ఖర్చు చేసింది.