హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసును మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. కేసును తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వేసి సీబీఐకి అప్పగించాలని కోరుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. ఈ కుట్రను పూర్తిగా బద్దలు కొట్టేందుకు సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వివిధ రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వాలను పడగొట్టాలనే లక్ష్యంతో బీజేపీ తరఫున దూతలుగా వచ్చిన ముగ్గురు బ్రోకర్లను హైదరాబాద్ పోలీసులు సాక్ష్యాధారాలతో పట్టుకోవడం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇతర రాష్ర్టాల నుంచి మధ్యవర్తులు రావడం, వారి వెనుక ‘పెద్దలు’ ఉన్నట్టు అనుమానాల నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది.
ఎమ్మెల్యేలకు ఎర కేసు అత్యంత సున్నితమైనది కావడం, సంచలనాత్మకంగా మారడంతో ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉండటుందని, అనుభవజ్ఞులైన అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీజీపీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న సర్కారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ఆయనతోపాటు నేరాల దర్యాప్తులో అపార అనుభవం, నూతన సాంకేతికతను ఉపయోగించుకోవడంలో నైపుణ్యం ఉన్న ఉన్నతాధికారులను ఈ బృందంలో సభ్యులుగా నియమించింది. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్హెచ్వో లక్ష్మీరెడ్డి ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.
ఎమ్మెల్యేలను వందల కోట్లు పెట్టి కొని..రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ పన్నిన కుట్రను భగ్నం చేసిన కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సర్కారు భావిస్తున్నది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటికే వాయిస్ రికార్డులు, వీడియో రికార్డులను సేకరించిన పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న దశలోనే బీజేపీ నేతలకు తమకు ఏమాత్రం సంబంధం లేదని చెబుతూనే విచారణను సీబీఐకి అప్పగించాలని కోర్టులను ఆశ్రయించారు. దర్యాప్తు 24 గంటలు గడవకముందే.. అంతగా అనుమానాలా ? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశాన్ని ఏలుతున్న పార్టీలోని పెద్దలే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉండకుండా కూల్చాలని యత్నించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఈ కేసు దర్యాప్తును స్థానిక పోలీసులే కొనసాగించవచ్చని హైకోర్టు నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మొత్తం తతంగంలో పెద్ద తలకాయలు ఎవరు ? ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఇలా చేశారు? ఎక్కడ ఎంత ఎర వేశారు ? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది ? వీరి ట్రాప్లు ఎలా కొనసాగుతున్నాయి ? పెద్ద తలకాయలకు, దూతలకు ఉన్న సంబంధాలు ఏమిటి ? ఇలా అన్ని కోణాల్లో సిట్ దర్యాప్తు చేయనున్నది. మరోవైపు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో మరిన్ని కీలక వివరాలు రాబట్టే అవకాశం ఉన్నది.
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్టయి చంచల్గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులను 2 రోజుల పోలీస్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. న్యాయవాదుల సమక్షంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు విచారించాలని ఆదేశించింది. అలాగే నిందితుల బెయిల్ పిటిషన్ను ఈ నెల 11కి వాయిదా వేసింది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలను పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకోనున్నారు.