తెలంగాణలో తాగడానికి నీళ్లున్నయా.. పుష్కలం!
భూగర్భజలాలు అడుగంటాయా?.. ఆ పరిస్థితే లేదు!
మన ప్రాజెక్టుల నీళ్లు సరిపోవా?.. మస్తుగ సరిపోతయ్!
మరి ఇంకెందుకు.. మనకు కొయినా నుంచి నీళ్లు?
ఎవరి ప్రయోజనాల కోసం? ఎవరి మెప్పు కొరకు ?
Telangana | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): పూర్తిగా అడుగంటే పరిస్థితులు ఉంటే నీటి కోసం ప్రయత్నాలు చేయవచ్చు. ఎంత ఖర్చయినా పెట్టవచ్చు. ఎంత నష్టాన్ని అయినా భరించవచ్చు. ఆ అవసరమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నీళ్ల కోసం చేస్తున్న ప్రయత్నం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఏకంగా 1,134 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొయినా డ్యామ్ నుంచి తాగునీటి కోసం మహారాష్ట్రకు లేఖ రాయాలని నిర్ణయించటంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కొయినా డ్యామ్ నుంచి 30 టీఎంసీలు కావాలని కోరుతూ సత్వరమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కృష్ణా బేసిన్లో నీటి కొరత ఉన్న నేపథ్యంలో కొయినా నుంచి కరెంటు ఉత్పత్తిని నిలిపివేసి, ఆ నీళ్లను తెలంగాణకు విడుదల చేయాలని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బదులుగా కరెంటును గానీ, పరిహారం గానీ అందిస్తామని మహారాష్ట్ర సర్కారు ఎదుట ప్రతిపాదించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు లేఖ రాశారు. అయితే ఆ నీటి అవసరమేమీ లేదని అధికారులు అంటున్నారు. మరెందుకు మహారాష్ట్ర నీళ్ల కోసం రాష్ట్ర సర్కారు వెంపర్లాడుతున్నది? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
శ్రీశైలం, నాగార్జునసాగర్కు ఈ ఏడాది పెద్దగా వరదలు రాలేదనేది వాస్తవం. అయితే, భూగర్భజలాలు మాత్రం ఇప్పటికీ పుష్కలంగా ఉన్నాయి. వేసవిలో తగ్గినా అది కూడా స్వల్పంగానే ఉండే అవకాశం ఉన్నదని భూగర్భజలశాఖ గత నివేదికలే తేల్చిచెప్తున్నాయి. ఇదిలా ఉంటే కృష్ణాబేసిన్లో తెలంగాణకు ఏడాది పొడవునా తాగునీటి అవసరాలకు 43.94 టీఎంసీలు అవసరమవుతాయని లెక్కలు చెప్తున్నాయి. అందులో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 16.5 టీఎంసీలు, పబ్లిక్ యుటిలిటీ కోసం దాదాపు 4 టీఎంసీలు, సాగర్ కింద నల్లగొండ జిల్లాలో అక్కంపల్లి, పెండ్లిపాకల, ఉదయసముద్రం, ఖమ్మంలోని పాలేరు, వైరా, సాగర్ టెయిల్పాండ్ పరిధిలో అవసరాలకు 11.69 టీఎంసీలు అవసరం. మొత్తం రాబోయే ఆరు నెలల కాలానికి లెక్కించినా 21.97 టీఎంసీలు అవసరం అవుతాయి.
ప్రస్తుతం జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లో తాగునీటి అవసరాలకు సరిపోగా, మిగులు జలాలు అందుబాటులో ఉన్నాయి. ఇక సాగర్లో మే నెల వరకు కావాల్సిన నీరు అందుబాటులో ఉన్నది. సాగర్, శ్రీశైలం రెండు రిజర్వాయర్లలో 82.78 టీఎంసీలు వినియోగానికి అందుబాటులో ఉన్నాయని తేల్చిన కేఆర్ఎంబీ.. అందులో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి కేటాయించింది. రాబోయే మే వరకు నీటి విడుదలకు అనుమతులు మంజూరు చేసింది. అలాంటప్పుడు కొయినా నుంచి ఏకంగా 30 టీఎంసీలను కోరుతుండటం వెనుక ఆంతర్యమేమిటో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల ద్వారా తాగునీటికి కా వాల్సిన నిల్వలు ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లోనూ ఎండీడీఎల్ దిగువకు వెళ్లి మరీ వినియోగించుకోవచ్చని అధికారులే చెప్తున్నారు. సాగర్, శ్రీశైలం 2 ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల అంశంపై అక్టోబర్లోనే కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం కొనసాగింది. ఆ సందర్భంగానే శ్రీశైలం ప్రాజెక్టు ఎం డీడీఎల్ను 805 ఫీట్లు, సాగర్ ఎండీడీఎల్ను 505 ఫీట్లకు నిర్ణయించారు. ఆ వేసవి ఆవిరి నష్టాలను లెక్కగట్టారు. ఆ మేరకే మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 82.78 టీఎంసీలు వినియోగానికి ఉన్నాయని తే ల్చారు. ఒకవేళ అత్యవసరమైతే కేఆర్ఎంబీ అనుమతులతో అంతకంటే దిగువకు సైతం వెళ్లి నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉన్నదని స్పష్టం చేస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో నీటిని వినియోగించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పుట్టంగండి వద్ద ఎమర్జెన్సీ మోటర్లు ఉన్నాయని వివరిస్తున్నారు.
శ్రీశైలంలో మొత్తంగా 27.14 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉన్నదని కేఆర్ఎంబీనే తేల్చింది. అక్కడ కల్వకుర్తి తాగునీటి అవసరాలకు 3.68 టీఎంసీలు, ఏపీ తాగునీటి అవసరాలకు 2 టీఎంసీలు అవసరమవుతాయి. అవి పోయినా ఇంకా 21.46 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. ఆ నీళ్లను దిగువకు ఎన్ఎస్పీలో విడుదల చేయించుకుంటే ఇక్కడి తాగునీటి అవసరాలను తీర్చుకునే అవకాశం ఉన్నది. కరెంటును కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలున్నా తెలంగాణ సర్కారు మహారాష్ట్రను తాగుజలాలను కోరటం అర్థం కాకుండా ఉన్నది.
కర్ణాటక నుంచి నీళ్లు దిగువకు వచ్చినా, పూర్తిస్థాయిలో జూరాలలో నిల్వ చేసుకునే వెసులుబాటు తె లంగాణకు లేదు. జూరాల ప్రాజెక్టు నిల్వ 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.51 టీఎంసీలు ఉన్నా యి. అంటే అక్కడ 3 టీఎంసీలకే అవకాశం ఉన్నది. సరే అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకునే కెపాసిటీ ఉన్నదా? అంటే అదీ లేదు. అంతిమంగా దిగువన శ్రీశైలం ప్రా జెక్టుకు విడుదల చేయాల్సిందే. అది ఉమ్మడి ప్రాజె క్టు. అదీగాక ఏపీలోని 7 జిల్లాల్లోని 103 మండలాల్లో కరువు నెలకొన్నది. మొత్తంగా రాయలసీమ జిల్లాలే. ఇప్పటికే ఏపీ అడ్డగోలుగా పోతిరెడ్డిపాడుతోపాటు పలు విధాలుగా నీటిని పెన్నాబేసిన్కు మళ్లిస్తున్నది.
దాదాపు అవి 125 టీఎంసీలు ఉంటాయని అంచనా. ఇటీవల 5 టీఎంసీల నీటి కోసమే ఏకంగా తెలంగాణ స్వాధీనంలో ఉన్న సాగర్ డ్యామ్పైకి సా యుధ బలగాలతో వచ్చి మరీ ముళ్లకంచెను ఏర్పాటు చేసి కుడికాలువ ద్వారా నీటిని తరలించుకుపోయింది. అలాంటిది ఇప్పుడు శ్రీశైలంలోకి నీళ్లు వస్తే ఏపీ మళ్లించకుండా ఉంటుందా? ఏపీ స్వాధీనం చేసుకున్న డ్యామ్నే తెలంగాణ సర్కారు ఇప్పటివరకు తిరిగి స్వాధీనం చేసుకోలేదు.
మరి దీనిని ఎలా నిలువరిస్తుంది? అనేది అతి పెద్ద ప్రశ్న. ఇన్ని అడ్డంకుల మధ్య మహారాష్ట్ర నుంచి తాగునీటిని తీసుకోవాలని తెలంగాణ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తున్నదో అర్థం కాని విషయమే. కర్ణాటక, ఏపీకి లేని అ వసరం తెలంగాణకే ఎందుకు వచ్చిందని ఇక్కడ మ రొక ప్రశ్న. అసలు ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించిం దా? అనాలోచితంగా చేసిందా? అనేది ప్రభుత్వమే చెప్పాల్సి ఉన్నది. అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ సర్కార్ ఇదంతా చేస్తున్నదని, ప్రజలకు ఏదో చేస్తున్నామనే భ్రమలను కల్పించడానికే ఈ ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చిందేమో? అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి 30 టీఎంసీలు విడుదల చేసినా సాగర్కు వచ్చేవి నామమాత్రమే. కొయినా డ్యామ్ మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కృష్ణా ఉపనది కొయినాపై ఉన్నది. దీని సామర్థ్యం 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. డ్యామ్ దిగువ కొయినా నది 136 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా నదిలో కలుస్తుంది. అక్కడి నుంచి సాగర్ వరకు దాదాపు 1,134 కిలోమీటర్లు. అందులో కర్ణాటకలోనే దాదాపు 560 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉన్నదని అంచనా. ఇంత దూరం నుంచి వచ్చే నీళ్లు ఎన్ననేది ప్రశ్న. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల నుంచి గేట్లను తెరిచి ఏకమొత్తంగా నీటి విడుదల చేయటం ఎట్టిపరిస్థితుల్లో కుదరదని అధికారులు చెప్తున్నారు. సూటిగా చెప్పాలంటే మహరాష్ట్ర 30 టీఎంసీల నీళ్లను విడుదల చేసినా సాగర్కు చేరేది 15 టీఎంసీలకు మించకపోవచ్చని అంటున్నారు.
మహారాష్ట్ర నీటిని విడుదల చేసినా అవి కర్ణాటక మీదుగానే రావాల్సి ఉన్నది. హిప్పర్గి బరాజ్, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లకు నీళ్లు చేరుకుంటాయి. మధ్యలో అనేక నిర్మాణాలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను కర్ణాటక ఏర్పాటు చేసుకున్నది. మరి ఆ నీటిని కర్ణాటక వాడుకోకుండా ఉంటుందా? అనేది ప్రశ్న. ఆ రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 236 తాలుకాల్లో 216 తా లుకాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రం నీళ్లను కచ్చితంగా నిలుపుకుంటుంది. దిగువకు నీటి విడుదలను కర్ణాటక ప్రభుత్వం అంగీకరించినా అక్కడి ప్రజలు ఊరుకుంటారా? ఒకవేళ ఆ నీటిని కర్ణాటక వాడుకున్నా అడిగేది ఎవరు? అని అధికారులే ప్రశ్నిస్తున్నారు.