హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడులు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకొంటున్న విద్యార్థులకు రవాణా భత్యాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా రాష్ట్రంలో 3,688 ఆవాసాల్లోని 30,395 మంది విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున వచ్చే విద్యాసంవత్సరానికి రూ.18.23 కోట్ల రవాణా భత్యాన్ని మంజూరుచేసింది.
2023 -24 విద్యాసంవత్సరానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రతిపాదనల మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో 32ను విడుదల చేశారు. విద్యాహక్కు చట్టం-2009 రూల్ (5), సబ్ రూల్ (4) ప్రకారం బడులు లేని ఆవాసాల్లోని విద్యార్థులకు రవాణా భత్యాన్ని విడుదల చేయాల్సి ఉన్నది. విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ బడులకు రాకపోకలు సాగించేందుకు ఈ భత్యాన్ని ఇస్తారు. కొంత మంది ఆటోలు, మరికొంత మంది వ్యాన్ల ద్వారా రాకపోకలు సాగిస్తూ ప్రభుత్వ బడుల్లో చదువుకొంటున్నారు. 1- 5వ తరగతి వరకు కిలోమీటర్, 8వ తరగతి వరకు 3 కిలోమీటర్లు, 9, 10 తరగతులకు 5 కిలోమీటర్ల దూరంలోని స్కూళ్లల్లో చదువుకొంటే రవాణాభత్యం ఇవ్వాలి. ఇలా వీరికి ప్రతి నెల రూ.600 చొప్పున రవాణా భత్యాన్ని అందజేస్తారు.