Anganwadi | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న గుడ్ల నాణ్యత, సైజుల విషయంలో అపోహలు తొలగించటమే కాకుండా లబ్ధిదారులకు తాజా గుడ్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే ఏజెన్సీల ఇష్ట్యారాజ్యానికి అడ్డుకట్ట వేయటంతోపాటు గుడ్లు వక్రమార్గం పట్టకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే గుడ్డుపై మూడు రంగుల్లో ముద్రలను వేసి సరఫరా చేయాలని సంబంధిత ఏజెన్సీలకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేసింది.
నెలలో మూడు దఫాలుగా పంపిణీ చేసే గుడ్లపై మూడు రంగులు ముద్రించి సరఫరా చేయాలని ఆదేశించింది. తొలి 10 రోజుల్లో పికాక్ బ్లూ, రెండో 10 రోజుల్లో రెడ్, మూడో 10 రో జుల్లో గ్రీన్ ముద్రలు గుడ్డుపై ఉండాలని, గుడ్డు బరువు, ఎత్తు, పొడవులకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను పేర్కొన్నది. అంగన్వాడీ కేంద్రాలను ఏడు జోన్లుగా విభజించి, ఏజెన్సీలను కేటాయించింది. గుడ్ల సరఫరా, పంపిణీకి ఏజెన్సీలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను స్పష్టంగా పేర్కొన్నది. ఈ క్రమంలో అంగన్వాడీ టీచర్/సహాయకురా లు నుంచి సూపర్వైజర్, సీడీపీవో, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా కలెక్టర్లు పోషించాల్సిన పాత్రపై విధివిధానాల్లో స్పష్టత ఇచ్చింది.
ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అం దించే పౌష్టికాహార పంపిణీ నిర్దేశిత నియమానుసారం ఉండేలా చూడాలి. గుడ్డు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా? లేదా అని చెక్ చేసుకోవాలి. గుడ్లను ర్యాండమ్గా ఆగ్మార్క్ నియమాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా అని చూసుకోవాలి. గుడ్ల బరువును పరిశీలించాలి. అంగన్వాడీ టీచర్ పరిశీలించిన తర్వాత వారి పరిశీలనను రిజిస్టర్లో నమోదు చేయాలి. నిర్దేశిత నియమాలకు అనుగుణంగా సరఫరా చేసిన గుడ్లు లేవని తెలిస్తే తక్షణమే వాటిని తిప్పి పంపించాలి. అంగన్వాడీ టీచర్తోపాటు సహాయకురాలికి కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్ల నాణ్యత, సర్కార్ మార్గదర్శకాలపై సంపూ ర్ణ అవగాహన ఉండాలి.
మొదట అంగన్వాడీ టీచర్ తర్వాత సూపర్వైజర్, సీడీపీవో, జిల్లా సంక్షేమ అధికారి ఇలా అంచెలవారీ పర్యవేక్షణ నిత్యం జరగాలి. జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా పాడి పరిశ్రమ, పశు సంవర్ధకశాఖ అధికారి, జిల్లా వ్యవసా య, మార్కెటింగ్శాఖ అధికారి, ఫుడ్ ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రాలజీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వీరితో ఏర్పాటైన జిల్లా పర్యవేక్షణ కమిటీ గుడ్ల పంపిణీ విషయంలో ప్రతీ మూడు నెలలకోసారి పరిశీలించాలి. పంపిణీదారుల గోదాములను క్షేత్రస్థాయిలో పరిశీలించి, కలెక్టర్కు నివేదికను అందించాలి. ఈ నివేదిక ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేనిపక్షంలో కలెక్టర్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్కు నివేదిక సమర్పించాలి.
పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని, ఆ మార్పులు పటిష్టమైన ఆహార పంపిణీకి దారి తీయాలన్న సంకల్పంతో ఇక నుంచి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే గుడ్లుపై ముద్ర వేయాలని నిర్ణయించాం. 10 రోజులకో గుడ్డుపై రంగు మార్పిడితో లబ్ధిదారులు పంపిణీ చేసిన గుడ్లను నిలువ ఉంచుకోకుండాఉంటారు. ఈ మార్పు కచ్చితంగా సంపూర్ణ ఆరోగ్య లక్ష్య సాధనకు దోహదం చేస్తుంది.
-సత్యవతి రాథోడ్, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి