మెండోరా/బాసర, జూలై 1: మహారాష్ట్రలోని గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు శనివారం తెరుచుకున్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం త్రిసభ్య కమిటీ సభ్యులు, సీడబ్ల్యూసీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రజిత్, ఈఈ బాన్సోద్, డీఈఈ ఆర్ఆర్ పటోదర్, ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి, ఏఈఈ వంశీ ఆధ్వర్యంలో బాబ్లీ గేట్లను పైకి ఎత్తారు.
ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న 0.473 టీఎంసీల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఈ నీరు సాయంత్రానికి తెలంగాణ సరిహద్దుల్లోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమ ప్రదేశానికి చేరుకున్నది. అక్టోబర్ 28 వరకు ఈ గేట్లను తెరిచి ఉంచుతారని ఈఈ చక్రపాణి తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 1,091.00 అడుగులు ( 90.313 టీఎంసీలు) కాగా, శనివారం సాయంత్రానికి 1,064.90 అడుగులు (20.068 టీఎంసీలు) నీరున్నదని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.