హైదరాబాద్, డిసెంబర్ 2 ( నమస్తే తెలంగాణ): నానాటికీ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తు అంధకారమేనని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ అనుభవాల దృష్ట్యా కాలుష్య నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలిక వ్యూహాలు అమలుచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా బుధవారం అరణ్యభవన్లో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు చేపట్టిన చర్యలను వివరించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్నదని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్దరణ, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడంతో అనుకున్న ఫలితాలను సాధిస్తున్నామని చెప్పారు. కాలుష్య కారకాలు, వ్యర్థాల నియంత్రణ, నిర్వహణకు సంబంధించిన చట్టాలను, నిబంధనలను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.