T20 World Cup : భారత్, శ్రీలంక వేదికగా రేపటి నుంచి టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. వామప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత జట్టు తొలి లీగ్ మ్యాచ్లో యూఎస్ఏతో తలపడనుంది. కానీ.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్పై మాత్రం అనిశ్చితి కొనసాగుతోంది. ఇండియాతో మ్యాచ్ బాయ్కాట్ చేస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించగా.. మేము ఆడేందుకు సిద్దమే అని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తేల్చి చెప్పాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొలంబోలో ఇండియాతో మ్యాచ్ ఆడకుంటే పాక్ జట్టుపై నిషేధం విధించాలని ఆయన పేర్కొన్నాడు.
భారత్లో వరల్డ్కప్ ఆడబోమని బెట్టు చేసినందుకు బంగ్లాదేశ్పై వేటు పడింది. అప్పటి నుంచి ఆ దేశ క్రికెట్ బోర్డుకు మద్దతిస్తున్న పాకిస్థాన్ మెగా టోర్నీలో భారత జట్టుతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని తెలిపింది. అయితే.. టీమిండియా కెప్టెన్ మాత్రం కొలంబో వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నామని.. ఫిబ్రవరి 15న పాక్తో మ్యాచ్కోసం స్టేడియానికి వెళ్తామని చెప్పాడు. శ్రీలంక బోర్డు సైతం ఇండియాతో మ్యాచ్ ఆడాలని పాక్ బోర్డుకు లేఖ రాసింది. లాహోర్ దాడిని గుర్తు చేస్తూ మ్యాచ్ను బాయ్కాట్ చేయొద్దని కోరింది. అయినా సరే పాక్ బోర్డు స్పందించలేదు. దాంతో, ఎంపిక పద్ధతిన ప్రపంచకప్ ఆడాలనుకున్న పాక్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు అన్నాడు.
‘భారత జట్టుతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామంటున్న పాకిస్థాన్పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో నిర్వహించిన అన్ని ఐసీసీ టోర్నమెంట్లకు భారత బోర్డు అద్భుతంగా ఆతిథ్యమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ పురోగతిలో ఆర్ధికంగా, క్రీడ పరంగా భారత్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. రాజకీయాలు చేస్తూ.. భారత్లో ఆడబోమని చెబుతున్న వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్లకు దక్కాల్సిన నిధులను నిలిపివేయాలి. కొన్ని ఏళ్ల పాటు ఏ జట్టుతోనూ క్రికెట్ ఆడకుండా వారిపై నిషేధం విధించాలి’ అని పాక్ బోర్డు తీరుపై ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. లోధా కమిటీ సిఫార్సులను తిరస్కరించినందుకు 2017లో బీససీఐ అధ్యక్ష పదవిని కోల్పోయాడు ఠాకూర్. అప్పటి నుంచి యనపై కొనసాగుతున్న నిషేధాన్ని సుప్రీం కోర్టు ఫిబ్రవరి 5వ తేదీన ఎత్తి వేసిన విషయం తెలిసిందే.
గత కొంత కాలంగాభారత్, పాక్ బోర్డుల అంగీకారం మేరకే ఇరుజట్ల మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహిస్తోంది ఐసీసీ. ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీలోనూ దాయాదుల మ్యాచ్లను హైబ్రిడ్ పద్ధతిన జరిపారు. ఈసారి కూడా శ్రీలంకలో మ్యాచ్ నిర్వహణకు ఇరుదేశాల బోర్డులు సమ్మతం తెలిపాయి. కానీ, కొలంబోలో ఫిబ్రవరి 15న భారత జట్టుతో లీగ్ దశ మ్యాచ్లో మేము ఆడం అని ప్రకటించిన పాక్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.