హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వేడుకలా జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అటవీశాఖ సిద్ధమైంది. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని జాతీయ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జూపార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పించనున్నట్టు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. శనివారం అన్ని జిల్లాల అటవీ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత తొమ్మిదేండ్ల కాలంలో హరితహారం అద్భుత విజయాలు సాధించిందని పేర్కొన్నారు.
గ్రామస్థాయి నుంచి జిల్లాల వరకు మొక్కలు నాటేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ సాగునీటిశాఖ ఆధ్వర్యంలో ఉన్న భూముల్లో ప్రత్యేకంగా హరితోత్సవం నిర్వహించి వాటికి దశాబ్ది సంపద వనాలుగా, గ్రామాలు, మండలాల్లో కొత్తగా మొక్కలు నాటే ప్రాంతాలకు దశాబ్ది వనాలుగా నామకరణం చేయాలని సూచించారు.