హైదరాబాద్, మే 28, (నమస్తే తెలంగాణ): కక్షిదారులు రాజీపడి లోక్ అదాలత్లో ఒప్పందం (అవార్డు) చేసుకొంటే.. దానిని సమీక్షించే అధికారం కింది కోర్టులకు లేదని హైకోర్టు స్పష్టంచేసింది. లోక్ అదాలత్లో చేసుకొన్న రాజీ ఒప్పందాలపై ఇరుపక్షాల్లో ఎవరికైనా అభ్యంతరం ఉంటే.. వాటిని సమీక్షించే పరిమిత అధికారం హైకోర్టులకు రాజ్యాంగంలోని 226, 227 అధికరణాలు కల్పించాయని పేర్కొన్నది. భార్యాభర్తల మధ్య 2006లో లోక్ అదాలత్లో కుదిరిన రాజీ ఒప్పందాన్ని వరంగల్ జిల్లా సివిల్ జడ్జి రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్ ఏ వెంకటేశ్వర్రెడ్డి తీర్పునిచ్చారు. భార్గవి నిర్మాణ సంస్థ-కే ముత్యంరెడ్డి మధ్య జరిగిన కేసులో, పంజాబ్ వర్సెస్ జలౌర్సింగ్ కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం లోక్ అదాలత్ ఇచ్చే అవార్డులపై జోక్యం చేసుకొనే పరిధి హైకోర్టులకు మాత్రమే ఉన్నదని స్పష్టం చేశారు. వరంగల్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు. లోక్ అదాలత్లో కుదిరిన రాజీ ఒప్పందం అమల్లోకి వస్తుందని తీర్పు చెప్పారు. లోక్ అదాలత్ అవార్డుపై అభ్యంతరం ఉంటే హైకోర్టులో సవాల్ చేసుకోవచ్చునని సూచించారు.