హైదరాబాద్/కరీంనగర్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నిర్వహిస్తున్న తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగే పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లుచేసింది. మొత్తం 503 పోస్టులకు 3,80,081 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో 1019 సెంటర్లలో పరీక్ష జరగనున్నది. అభ్యర్థులు 2 గంటల ముందే సెంటర్లకు చేరుకోవాలని తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ సూచించారు. 10.15 దాటితే పరీక్ష హాల్లోకి అనుమతించరని చెప్పారు. పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ అనేక కొత్త సంస్కరణలు ప్రవేశ పెట్టింది. తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రతికేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.
మల్కాజిగిరిలో అత్యధికం
రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా గ్రూప్-1 పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆ జిల్లా పరిధిలోని 115 సెంటర్లలో 51,931 మంది పరీక్ష రాయనున్నారు. ఆ తర్వాత స్థానాల్లో హైదరాబాద్ (106 సెంటర్లలో 51,851 మంది), రంగారెడ్డి (128 సెంటర్లలో 51,718 మంది) జిల్లాలో పరీక్ష రాయనున్నారు. ములుగు జిల్లాలో అతి తక్కువగా 7 సెంటర్లలో 1,933 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరిసరాల్లోని జిరాక్స్ షాపులను మూసివేశారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు, ఏర్పాట్లు చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ సూపరింటెండెంట్లతోపాటు టీఎస్పీఎస్సీ ప్రత్యేక అధికారి ఒకరు పరీక్షను స్వయంగా పర్యవేక్షించనున్నారు.
12 శాతం మంది హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోలే…
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారిలో ఇంకా 12 శాతం (సుమారు 45వేలు) మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదని అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నారు. మేడ్చల్ మల్కాజిగిరిలో 7,978 మంది, హైదరాబాద్ జిల్లాలో 7,863 మంది, రంగారెడ్డి జిల్లాలో 7,580 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేయలేదు. అయితే.. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే కొద్దిసేపటి ముందు కూడా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకొనే అవకాశం ఉన్నది. ఆదివారం ఉదయం 10 గంటలలోపు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వారు పరీక్ష రాస్తారు.
ఐడీ ప్రూఫ్ మరువొద్దు
గ్రూప్-1 పరీక్షకు వెళ్లే అభ్యర్థులు బంగారు ఆభరణాలు వేసుకొని రావొద్దని టీఎస్పీఎస్సీ సూచించింది. మంగళసూత్రం వరకూ అవకా శం కల్పించారు. పాస్పోర్టు, పాన్కార్డు, ఓటర్ ఐడీ, అధార్తోపాటు ఇతర గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అభ్యర్థులు చెప్పులు మాత్ర మే వేసుకొని వెళ్లాలి. ఏ4 సైజులో ఉన్న హాల్టికెట్ జిరాక్సు తీసుకెళ్లాలి. అవకాశం ఉంటే కలర్ జిరా క్స్ తీసుకురావాలని టీఎస్పీఎస్సీ అధికారులు సూచిం చారు. ఫోన్లు, పర్సు, హ్యాండ్బ్యాగులు, వాచీ లకు ఎలాంటి అనుమతిలేదు. వినికిడి యంత్రాలు తెచ్చుకొనే అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన సదరం సర్టిఫికెట్ తీసుకెళ్లాలి. పరీక్ష కేంద్రంలో గోడ గడియారాలేమీ ఉండవు. అందుకే అభ్యర్థులకు సమయం తెలిసేందుకు ప్రతి అరగంటకు ఓసారి అలర్ట్ చేసేలా గంట మోగిస్తారు. పరీక్ష సమయం తర్వాతే బయటకు వెళ్లాల్సి ఉంటుంది.
గ్రూప్-1 అభ్యర్థులకు మంత్రి ఆల్ ది బెస్ట్
నేడు (ఆదివారం) జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అభ్యర్థులు సకాలంలో హాజరై ప్రశాంతంగా రాయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సూచించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలయ్యిందని.. ఈ ఉద్యోగాలతో కీలక పోస్టులు సాధించవచ్చన్నారు. ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాయబోతున్న అభ్యర్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.