హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం అమలుతోపాటు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఏ ఉపాధి మార్గం అత్యంత లాభదాయకంగా ఉంటుందో, ఏ రంగాన్ని ఎంచుకుంటే ఎలాంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయో తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వం.. యూనిట్ల పంపిణీ తర్వాత కూడా లబ్ధిదారులకు వెన్నుదన్నుగా నిలిచేలా కార్యాచరణను రూపొందిస్తున్నది. మద్యం షాపుల్లో, వైద్యశాలలకు భోజనం సరఫరా చేసే ఏజెన్సీల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్న తరహాలోనే.. ప్రభుత్వ కార్యాలయాల్లో లీజుకు తీసుకునే వాహనాల్లోనూ దళితబంధు యూనిట్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నది.
ప్రభుత్వ లీజుల్లో దళితబంధు పథకం కింద మంజూరైన వాహనాలకే మొదటి అవకాశం కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం అన్ని కార్యాలయాల్లో పలువురు సీనియర్ అధికారులకు వాహన సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కార్యాలయాల అవసరాల కోసం ఎక్కువభాగం ప్రైవేటు వ్యక్తుల నుంచి వాహనాలను లీజుకు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లీజు వాహనాల్లో దళితబంధు యూనిట్లకే తొలుత ప్రాధాన్యమిచ్చేలా ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించేందుకు సన్నద్ధమవుతున్నది. దళితబంధు లబ్ధిదారుల్లో చాలామంది ట్రావెల్ కార్ల కొనుగోలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం వారికి అండగా నిలువాలని నిర్ణయించింది. లీజుల్లో ప్రాధాన్యమివ్వాలన్న నిర్ణయంతో దళితబంధు లబ్ధిదారులకు నెలవారీగా కచ్చితమైన ఆదాయం సమకూరి వారు ఆర్థికంగా స్థిరపడతారని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ దిశగా త్వరలోనే కలెక్టర్లకు ఆదేశాలిచ్చేందుకు సమాయత్తమవుతున్నది.
సీఎం కేసీఆర్ మార్గదర్శకాల మేరకు..
దళితుల ఆర్థిక స్వావలంబన కోసం దేశంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం లీజుకు తీసుకునే వాహనాల్లో దళితబంధు కింద మంజూరైన యూనిట్లకే మొదటి ప్రయారిటీ ఇవ్వాలని యోచిస్తున్నాం. త్వరలోనే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడనున్నాయి.
– ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్