హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో డంప్యార్డ్ వద్దంటే తనను బెదిరిస్తున్నారని, సీబీసీఐడీ విచారణ పేరిట బ్లాక్మెయిల్ చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోబోమని, కేసులు, బెదిరింపులకు భయపడబోమని చెప్పారు. ప్రాణం పోయినా డంప్యార్డ్ రద్దయ్యేదాకా పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. హుజూరాబాద్ను చెత్తకుప్పగా మార్చే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా మాట్లాడుతూ.. నాలుగు జిల్లాల చెత్త తరలించేందుకు హుజూరాబాద్లో డంప్యార్డ్ నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. డంప్యార్డ్తో గాలి, నీరు, భూమి కలుషితమై ప్రజల జీవితం దెబ్బతింటుందని, వ్యవసాయం నాశనమవుతుందని, తాగునీరు విషతుల్యమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
డంప్యార్డ్ రద్దు కోసం ఈ నెల 22 నుంచి పాదయాత్ర చేస్తామని కౌశిక్రెడ్డి ప్రకటించారు. ఈ పాదయాత్రను ప్రజా ఉద్యమంగా మార్చి ప్రభుత్వంపై పోరాటం చేస్తానని చెప్పారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతుంటే కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్, 20ఏండ్లపాటు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఈటల ఎందుకు స్పందించడంలేదని, ప్రజలప్రాణాలు వారికిపట్టవా? అని ప్రశ్నించారు.