హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ సీఐడీ నమోదు చేసిన ఫైబర్నెట్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మొత్తం రూ.114 కోట్ల ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతిస్తూ న్యాయాధికారి హిమబిందు ఆదేశాలు జారీ చేశారు. టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ (ఏ11), ఆయన భార్య పవనా దేవి, నెప్టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ సంస్థ డైరెక్టర్ కనుమూరి కోటేశ్వరరావు ఆస్తులతోపాటు ఆ రెండు సంస్థల ఆస్తులను జప్తు చేయాలని సీఐడీ కోరింది.