హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నది. ఈ పరీక్షకు 70,041 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతిలో చేరేవారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఆరో తరగతిలో 19,400 సీట్లకు గాను 40,137 దరఖాస్తులు వచ్చాయి. 7 నుంచి 10వ తరగతి ప్రవేశాలకూ భారీగానే దరఖాస్తులొచ్చాయి. మిగులు సీట్లను ఈ పరీక్ష ద్వారా భర్తీచేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 194 మాడల్ స్కూళ్లు ఉండగా, పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో ఉచిత బోధన జరుగుతుంది. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం సమకూరుస్తారు. రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు, జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తారు.
మాడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలను, మెరిట్ జాబితాను మే 24న ప్రకటిస్తాం. 25 నుంచి 31 వరకు ఎంపికైన వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తాం. జూన్లో తరగతులు ప్రారంభిస్తాం. ఇప్పటికే పరీక్ష ఏర్పాట్లు పూర్తి చేశాం. ఏవైనా సమస్యలుంటే 040-23120335, 23120336 నెంబర్లలో సంప్రదించాలి. విద్యార్థులు మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి.
– రమణకుమార్, మాడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్