హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ 2024 నాటికి నెట్ జీరో ఎనర్జీ సంస్థగా అవతరిస్తుందని, దేశంలోనే పూర్తి పర్యావరణ హిత సోలార్ ఎనర్జీతో నడుస్తున్న తొలి బొగ్గు సంస్థగా చరిత్ర సృష్టిస్తుందని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ శుక్రవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన దేశ వ్యాప్త బొగ్గు కంపెనీల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ తన అవసరాల కోసం ప్రస్తుతం వినియోగిస్తున్న థర్మల్ విద్యుత్తుకు సమాన స్థాయిలో సౌర విద్యుత్తును స్వయంగా ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. సింగరేణి సంస్థ 42 బొగ్గు గనులు, దాదాపు 43 వేల మంది కార్మికులు నివసించే కాలనీల అవసరాల కోసం ఏటా 700 మిలియన్ యూనిట్ల విద్యుత్తును తెలంగాణ ట్రాన్స్కో నుంచి కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. రానున్న ఏడాదిలో ఈ మొత్తాన్ని సౌర విద్యుత్తు ద్వారా ఉత్పత్తి చేస్తామని స్పష్టంచేశారు.
సంస్థ తన వ్యాపార విస్తరణ, పర్యావరణ హిత విద్యుత్తు విధానంలో భాగంగా ఇప్పటికే 224 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లను నెలకొల్పి ఏడాదికి 350 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నదని వివరించారు. దీనితో సింగరేణి వినియోగిస్తున్న మొత్తం విద్యుత్తులో ఇప్పటికే సుమారు 50 శాతాన్ని ఆదా చేస్తున్నదని చెప్పారు. ఈ ఏడాది జూన్ చివరి నాటికి మరో 120 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. మరో ఏడాదిలోగా 150 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను భూపాలపల్లి, మందమర్రి ఏరియాల్లో ఏర్పాటుచేస్తామని, వీటిద్వారా మరో 230 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని వివరించారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణరావు, జీఎం సురేశ్, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు, సింగరేణి సోలార్, థర్మల్ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.