కొడంగల్, అక్టోబర్ 23: అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానలకు తక్కువ సమయంలో ఔషధాలను సరఫరా చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందుకోసం డ్రోన్ సహాయంతో ఆకాశ మార్గాన మందులు చేరవేసే ప్రక్రియ చేపట్టింది. శనివారం వికారాబాద్ ఏరియా దవాఖాన నుంచి కొడంగల్ పీహెచ్సీకి డ్రోన్ ద్వారా మందులు తరలించారు. వికారాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ నుంచి డ్రోన్ మందులను మోసుకెళ్లింది. ఈ సందర్భంగా మారుత్ డ్రోన్ కంపెనీ ప్రతినిధి ప్రేమ్కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు డ్రోన్ ఆకాశ మార్గాన 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం మాత్రమే ట్రయల్ రన్ పూర్తయ్యాయని, వికారాబాద్ నుంచి కొడంగల్కు ఆకాశ మార్గంలో 42 కిలోమీటర్ల దూరం డ్రోన్ ప్రయాణించడం దేశంలోనే మొదటి సారి అని ఆయన పేర్కొన్నారు. ఇంతదూరం ప్రయాణించిన తరువాత చేరవేసిన మందుల ఉష్ణోగ్రతను పరిశీలించినట్టు చెప్పారు. పూర్తి భద్రతా ప్రమాణాలతో ఔషధాలను తరలించవచ్చనే నిర్ధారణకు వచ్చినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం 5 కిలోల బరువుతో డ్రోన్ ప్రయాణం సాగించిందని, రానున్న రోజుల్లో అవసరాన్ని బట్టి 16 కిలోల బరువుతో మందులు చేరవేస్తామని చెప్పారు. డ్రోన్ ద్వారా వ్యాక్సిన్, మెడిసిన్, బ్లడ్ శాంపిల్స్ వంటి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మారుత్ డ్రోన్ కంపెనీ సిబ్బంది సూరజ్పెద్ది, రాములుతోపాటు కొడంగల్ పీహెచ్సీ వైద్యులు డాక్టర్ వీణ, డాక్టర్ శ్రావణి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.