లింగాల గణపురం : జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో పలు వార్డుల్లో( Wards division) అధికారులు గజిబిజిగా ఓటర్లను చేర్చడం గందరగోళంగా మారింది. అధికారులు ఏ ఇంటి నుంచి మొదలు పెట్టి ఏ ఇంట్లో ముగించారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా వార్డుల్లో పోటీ చేసే వార్డు సభ్యులు ఓటర్లను మిగతా వార్డుల్లోకి వెళ్లి వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. లింగాల గణపురంలో 11వ వార్డులో కడకంచి నరసింహులు పేరు నమోదు కాగా అతని భార్య కడకంచి లక్ష్మి పేరు 9వ వార్డులో నమోదు చేశారు.
ఒకే ఇంట్లో ఉంటున్న భార్యాభర్తలను రెండు వార్డుల్లో చేర్చడంతో ఆ కుటుంబం అధికారులపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అలాగే ఓకే వీధిలో పక్క పక్కనే ఉన్న మూడు ఇండ్లను అధికారులు మూడు వార్డుల్లో చేర్చి చేతులు దులుపుకున్నారు. మండలం మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామ సర్పంచ్ పదవికి ఓటు వేసే సమయంలో గ్రామ మొత్తాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. వార్డు విషయానికి వచ్చేసరికి ఆయా వార్డుల్లోని ఓటర్లు మాత్రమే ఆయా వార్డు సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆయా వార్డుల్లో పోటీ చేసే వార్డు సభ్యులు తమ ఓటర్లను ఇతర వార్డుల్లో వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.