Free Bus | నవీపేట, జనవరి 3: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం ముగ్గురు విద్యార్థినుల అదృశ్యానికి కారణమైంది. బాలికలు స్కూల్కు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆధార్ కార్డులతో ఇంటినుంచి బయల్దేరిన విద్యార్థినులు బస్సుల్లో చక్కర్లు కొట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే వారిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు శుక్రవారం వెల్లడించారు. నవీపేట మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సమీప గ్రామాల్లోని ముగ్గురు బాలికలు పదో తరగతి చదువుతున్నారు.
రోజూలాగే గురువారం స్కూల్కు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయల్దేరారు. బడికి డుమ్మా కొట్టి ఉచిత బస్సులో పొద్దంతా చక్కర్లు కొట్టాలని ముందుగానే నిర్ణయించుకున్న ఆ ముగ్గురు ఆధార్ కార్డులను వెంట బెట్టుకుని వచ్చారు. స్కూల్ బ్యాగులను ఎక్కడో వదిలేసి ఒక్కచోట కలుసుకున్నారు. నవీపేట బస్టాండ్లో బస్సు ఎక్కి బోధన్కు వెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ నవీపేట్ మీదుగా నిజామాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి కామారెడ్డికి వెళ్లి తిరిగి నిజామాబాద్కు వచ్చారు. అటు నుంచి నవీపేట్కు వెళ్లి మళ్లీ నిజామాబాద్కు వచ్చి జగిత్యాలకు వెళ్లారు. తిరిగి నిజామాబాద్కు చేరుకున్నారు.
బాలికలు స్కూల్కు రాకపోవడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరా తీశారు. పిల్లలు పొద్దున్నే ఇంటి నుంచి బయల్దేరారని వారు చెప్పగా, స్కూల్కు రాలేదని టీచర్లు స్పష్టం చేశారు. దీంతో కంగారు చెందిన తల్లిదండ్రులు రోజంతా వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించక పోవడంతో నవీపేట్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసు అధికారులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలించారు. అదృశ్యమైన బాలికల్లో ఒకరి దగ్గర ఫోన్ ఉండడంతో, సెలఫోన్ సిగ్నల్ ఆధారంగా నిజామాబాద్ బస్టాండ్లో పట్టుకున్నారు.
మరో ఇద్దరి ఆచూకీ లభ్యం కాలేదు. నవీపేట ఎస్సై వినయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిజామాబాద్ బస్టాండ్లో తిష్ట వేశాయి. శుక్రవారం సాయంత్రం ఇద్దరు బాలికలు బస్సు దిగుతుండగా పట్టుకుని నవీపేట్ ఠాణాకు తీసుకొచ్చారు. ముగ్గురు విద్యార్థినులను వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించడంతో ఉత్కంఠకు తెరపడింది. ఉచిత బస్సు ప్రయాణం తమ పిల్లలకు ప్రాణ సంకటంగా మారిందని విద్యార్థులు తల్లిదండ్రులు అందోళన వ్యక్తం చేశారు.