హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అద్భుతంగా సాగుతున్నదని కేరళ రాష్ట్ర స్పోర్ట్స్, మ్యూజియమ్స్, ఆరియాలజీశాఖల మంత్రి అహ్మద్ దేవర కోవిల్ ప్రశంసించారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై తమకు సంపూర్ణ అవగాహన ఉన్నదని చెప్పారు. శనివారం రాష్ట్ర శాసనమండలి, శాసనసభలను ఆయన సందర్శించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. శాసనసభ, శాసన మండలి సమావేశ మందిరాలను కేరళ మంత్రికి చూపించారు.
రాష్ట్ర శాసనసభ సమావేశాల తీరు, ఉభయ సభల్లో జరిగే చర్చలు, తీసుకున్న చారిత్రక నిర్ణయాలు, ప్రజాస్పందన వంటి విశేషాలను ఈ సందర్భంగా గుత్తా.. కేరళ మంత్రికి వివరించారు. తెలంగాణ చారిత్రక పోరాట నేపథ్యం గొప్పదని, ఆ స్ఫూర్తితో రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తున్నదని కేరళ మంత్రి దేవర కోవిల్ కొనియాడారు. కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, సచివాలయ అధికారులు పాల్గొన్నారు.