భీమారం, మే 24: ‘చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ అనుచరులు పోతన్పల్లి పీఏసీఎస్ సెంటర్ను భూక్య రాజ్కుమార్కు కేటాయించారు. ఆయన ఒక్క రోజు కూడా ఇక్కడికి వచ్చింది లేదు. 20 రోజులైతంది. ఒక్క గింజా కూడా కొన్నది లేదు. మా వడ్లు మొత్తం చెరువులో పడేస్తాం’ అని మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోతన్పల్లి గ్రామ రైతులు మండిపడ్డారు. పోతన్పల్లి సెంటర్ నిర్వాహకుడిని మార్చాలని డిమాండ్ చేస్తూ గురువారం మంచిర్యాలలో అదనపు కలెక్టర్ను కలిసి రైతులు ఫిర్యాదు చేయగా, శుక్రవారం మంచిర్యాల జిల్లా పౌరసరఫరాల డీఎం గోపాల్ పోతన్పల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు రాజ్కుమార్ రైతులపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నాడని, వర్షాలు వచ్చే అవకాశమున్నందున త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని, అవసరమైతే పోతన్పల్లిలో ఐకేపీగానీ.. డీసీఎంఎస్కు కొనుగోళ్ల బాధ్యత అప్పగించాలని రైతులు ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని డీఎం గోపాల్ రైతులకు హామీ ఇచ్చారు. అంతకుముందు డీఎం గోపాల్ దాంపూర్ ఐకేపీ ఇన్చార్జి పద్మతో ఫోన్లో మాట్లాడారు. అక్కడ నుంచి గన్నీ బ్యాగులు ఇక్కడ ఎందుకు వేశారని అడిగారు.
రైతులు అక్కడ సెంటర్ లేదని తెలిపారని, దాంతో గన్నీ బ్యాగులను పోతన్పల్లి రైతులకు పంపినట్టు ఆమె తెలిపారు. ఎన్నికల కోడ్ ఉండగా, పాత వారిని తొలిగించి కాంగ్రెస్ కార్యకర్తకు ఈ సెంటర్ అప్పజెప్పడం విశేషం. ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకుడు రాజ్కుమార్ నాయక్, రైతులు పానుగంటి లచ్చన్న, ఎడ్ల నారాయణ, నరేందర్, జర్పుల రమేశ్, దుర్గం రమేశ్, ఆకుల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.