Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా.. విగ్రహం ఏర్పాటు పనులకు బుధవారం సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెలికం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన మహానేత రాజీవ్ గాంధీ అని, దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడని చెప్పారు. విగ్రహావిష్కరణకు సోనియాగాంధీని ఆహ్వానిస్తామని తెలిపారు.
సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. ‘సచివాలయంలో కొలువుదీరే ప్రభుత్వం అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకునేలా అమరజ్యోతి ఓవైపు.. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు నివాళిగా 125 అడుగుల మహా విగ్రహం మరోవైపు ఇప్పటికే ఏర్పాటయ్యాయి.
సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో తెలంగాణ అస్థిత్వ పతాక సమున్నతంగా ఎగురుతుంది’ అనే భావనతో డిజైన్లు కూడా సిద్ధం చేయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పనులు ప్రారంభించలేదు. ఇప్పుడు ఆ స్థలంలో రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటుచేయాలన్న సీఎం రేవంత్రెడ్డి నిర్ణయంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసి, కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే ట్యాంక్బండ్ పరిసరాల్లో కాంగ్రెస్ నేతలైన ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్రెడ్డి విగ్రహాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. వీటికి అదనంగా ఇప్పుడు రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఏమిటని మండిపడుతున్నారు.
అమరులకు నివాళిగా నిర్మించిన అమరజ్యోతి ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మారుస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడున్న నమూనాలోగానీ, కొత్త నమూనాలోగానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని స్పష్టం చేస్తున్నారు. లేదంటే పోరాటాలకు సైతం వెనుకాడమని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
తెలంగాణ ఆనవాళ్లు తుడిచేసేలా..
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆనవాళ్లు తుడిచేసేలా ప్రవర్తిస్తున్నదని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. సచివాలయం ఎదురుగా ఉన్న స్థలంలో గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించి, ఈ మేరకు ప్లాన్ కూడా సిద్ధం చేసిందని తెలిపారు. ఈ లోపు ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిందన్నారు. ఇప్పుడు ఆ ప్రదేశంలో రాజీవ్గాంధీ విగ్రహం పెట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.
తెలంగాణ ఉద్యమ అస్థిత్వాన్ని మరుగుపరచే విధంగా, తెలంగాణ ఆనవాళ్లు తుడిచివేసేలా అనేక కార్యక్రమాలు చేస్తున్నదని మండిపడ్డారు. ‘ఆంధ్ర వలస వాదుల, ప్రవాసాంధ్ర మేధావుల సలహాలతో తెలంగాణ తల్లిని కించపరుస్తూ, చరిత్ర కలిగిన కాకతీయులను, గోలొండ నవాబులను ఇప్పటికే కించపరుస్తూ మాట్లాడారు. వెంటనే రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటును విరమించుకోవాలని భారతరాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నది’ అని పేర్కొన్నారు.