హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీజలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. 31 మార్చి 2024 వరకు పెంచుతూ కేంద్ర జలశక్తిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జలాల పంపిణీ కోసం 2004లో బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ను కేంద్రం ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ 2013 అవార్డును ప్రకటించగా, దానిపై అభ్యంతరాలను తెలుపుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిం ది. ఆ వాదనలు పూర్తయ్యే దశలో ఉండగా ఏపీ పునర్విభజన జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలను ఇరు రాష్ర్టా ల మధ్య పంపిణీ చేసే బాధ్యతను కూడా బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కే కేంద్రం అప్పగించింది.
ఏడాదిలోగా పూర్తిచేసి అవార్డును ప్రకటించాల్సి ఉన్నా 2014 నుంచి ఇప్పటికీ విచారణ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం దాని గడువును ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ వెళ్తున్నది. గతంలో ఇచ్చిన గడువు ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి ట్రిబ్యునల్ తన తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలాలపై విచారణ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ గడువును మరోమారు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.