హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తేతెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరాన జరిగిన ప్రెసిడెంట్ ఫ్లీట్ అబ్బురపర్చింది. ఆర్కే బీచ్ నుంచి తెన్నేటి పార్కు వరకు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్) కొనసాగింది. యుద్ధనౌకలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమీక్షించారు. సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం సంప్రదాయం. మిలన్ -2022 పేరుతో జరిగిన నౌకాదళ విన్యాసాల్లో 55 యుద్ధనౌకలు, 56 విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. విశాఖపట్నం ఐఎన్ఎస్ యుద్ధనౌక, జలాంతర్గామి ఐఎస్ఎస్ వేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఐఎన్ఎస్ సుమిత్ర నౌకలో ప్రయాణిస్తూ రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు. ఆయనకు సెల్యూట్ చేస్తూ ఫ్లీట్ రివ్యూలో యుద్ధనౌకల విన్యాసాలు సాగాయి. గగనతలంలో ఎయిర్క్రాఫ్ట్లు చేసిన విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. విన్యాసాల్లో 10 వేల మందికి పైగా నావికా సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఈ పరేడ్ ద్వారా మన నౌకాదళశక్తిని మరోసారి చాటి చెప్పారని తెలిపారు.