నిజామాబాద్ : సొంతంగా నచ్చిన, మెచ్చిన పని చేసుకుని దళితులు ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబం పరంగా బాగుపడాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన దళిత బంధు పథకంపై బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..ఈ పథకంలో మొదటి విడతగా ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళితబంధును ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పథకం కింద అందించే పది లక్షల రూపాయల నగదు పూర్తిగా 100 శాతం సబ్సిడీ. లబ్ధిదారులు రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన పని లేదన్నారు.
ఇచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితిన్ వి పాటిల్, నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్,తదితరులు పాల్గొన్నారు.