నాంపల్లి కోర్టులు, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో నిందితుల విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేస్తూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో 37వ నిందితుల వరకు కోర్టుకు హాజరయ్యారు. 16వ నిందితుడు న్యూజిలాండ్లోని ఓ కంపెనీ మేనేజర్గా పనిచేస్తున్న సాన ప్రశాంత్కు నాన్ బెయిలబుల్ వారెంట్ కొనసాగుతున్నదని మెజిస్ట్రేట్ సిట్ అధికారులకు తెలిపారు. ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిందితుడు ప్రశాంత్ న్యూజిలాండ్లో ఉండటంతో ఆయన తరఫున నాంపల్లి నాలుగో ఆదనపు సెషన్స్ కోర్టులో దాఖలైన ముందస్తు బెయిల్ను తిరస్కరించారు. మరోవైపు నిందితుడి తరఫున వారెంట్ను తొలగించేందుకు రీకాల్ దాఖలు చేసే అవకాశమున్నది. ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్కుమార్ తరఫు న్యాయవాది హైకోర్టులో బెయిల్ దాఖలు చేశారు. ఇప్పటివరకు రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైలులో ఆయన కొనసాగుతున్నాడు. ఈ కేసులో నలుగురు నిందితుల తరఫున న్యాయవాదులు గైర్హాజరు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వచ్చేనెల 13న నిందితులకు ఎగ్జామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు 12వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు చర్యలు చేపడుతున్నది.