వనపర్తి : తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం ఆశ్చర్యపోతున్నది. ఇన్ని పథకాలు ఎలా అమలు చేస్తున్నారని అడుగుతున్నారని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. గురువారం జిల్లాలోని ఖిలా గణపురం మండలంలోని వివిధ గ్రామాలు.. తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ..వివిధ రాష్ట్రాల నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి పథకాలపై అధ్యయనం చేస్తున్నారు.
నేను చెప్పే మాటలో సత్యం, ధర్మం ఉంటే నాకు ఓటు వేయండి. రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగినందుకు గాను రైతుబంధు దశలవారీగా రూ.16 వేలకు పెంచుతామన్నారు. గ్యాస్ ధర పది సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సబ్సిడీ భరించి గ్యాస్ సిలిండర్ రూ.400 లకే ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. సాగునీళ్లు రావడం మూలంగా పంట పొలాలలో జోరుగా వ్యవసాయం పెరిగింది. అందుకే భూముల ధరలకు రెక్కలు వచ్చాయన్నారు. కారు గుర్తుకు ఓటువేసి మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.