Kalwakurthy | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు మరో ప్రతిష్ఠాత్మక రోడ్డు అందుబాటులోకి రానున్నది. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు నిర్మించే ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణా నదిపై 4 లేన్ల ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా ఏపీలోని నంద్యాల వరకు సాగే ఈ రోడ్డుతో హైదరాబాద్-తిరుపతి మధ్య ప్రయాణ దూరం దాదాపు 50 కి.మీ. మేరకు తగ్గుతుంది. ప్రస్తుతం ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం టెండర్ల దశలో ఉన్నది. ఏపీలో భూసేకరణ సమస్యల వల్ల ఈ రోడ్డు నిర్మాణం నత్తనడకన సాగుతున్నప్పటికీ తెలంగాణలో టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో పనులు చేపట్టారు.
కల్వకుర్తి టౌన్లోని జంక్షన్ నుంచి ప్రారంభమైల్ నాగర్కర్నూ, కొల్లాపూర్, సోమశిలతోపాటు ఏపీలోని సంగమేశ్వరం, ఆత్మకూర్, వెలుగోడు మీదుగా నంద్యాల వరకు సాగే ఈ రోడ్డును కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ 167కేగా ప్రకటించింది. ఇది కల్వకుర్తి జంక్షన్ వద్ద ఎన్హెచ్ 765తో అనుసంధానమవుతుంది. మొత్తం మూడు ప్యాకేజీలుగా విభజించిన ఈ రోడ్డును రూ.3,382 కోట్లతో నిర్మించనున్నారు. దీనిలో భాగంగా తెలంగాణలో 87 కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.887 కోట్లు వెచ్చించనున్నారు. రాష్ట్రంలో 7 మేజర్, 24 మైనర్ జంక్షన్ల గుండా సాగే ఈ రోడ్డపై 2 మేజర్, 33 మైనర్ బ్రిడ్జీలతోపాటు 4 అండర్పాస్లను నిర్మించనున్నారు.