నిర్మల్ : నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి
మూడు నెలల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆయన జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ సముదాయాన్ని పరిశీలించారు. కలెక్టర్ ముశ్రఫ్ అలీ ఫారూఖీ, ఇతర అధికారులు, గుత్తేదారులతో కలిసి నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్లో మంత్రి కలియతిరిగారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ల చాంబర్లు, మీటింగ్ హాల్స్, ప్రభుత్వ శాఖల కార్యాలయాలను పరిశీలించారు.
అనంతరం భవనం ఆవరణలో జరుగుతున్న సుందరీకరణ, గార్డెనింగ్, అప్రోచ్ రోడ్డు, తదితర పనులపై ఆరా తీశారు. నిర్మాణ ప్రగతిపై అక్కడే సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. భవన నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.