Congress | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): వామపక్షాలతో పొత్తుపై ఎటూ తేల్చకుండా కాంగ్రెస్ దాగుడుమూతలు ఆడుతున్నది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో వామపక్షాలతో పొత్తుపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కథ మొదటికొచ్చింది.
మెజార్టీ పార్టీ నేతలు వామపక్షాలతో పొత్తు అవసరం లేదని అభిప్రాయపడ్డారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇదే అంశంపై శనివారం ఆయన వామపక్ష నేతలతో సమావేశం కానున్నారు. ఇది ఒక కొలిక్కి వచ్చిన తరువాతే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో సీపీఎంకు మిర్యాలగూడ, భద్రాచలం స్థానాలు, సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం స్థానాలు కేటాయిస్తారని తొలుత ప్రచారం జరిగింది.