రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించడంలో మొండివైఖరి అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నేతన్నలు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 6న సిరిసిల్లలో నేతన్నల గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర వ్యాపార సంఘం భవనంలో పరిశ్రమ అనుబంధ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కారదర్శి కూరపాటి రమేశ్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల బకాయిలు రూ.270 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. నేతన్నల సమస్యలు పరిష్కారానికి రాజకీయాలకతీతంగా ఐక్య వేదిక (జాయింట్ యాక్షన్టీం)ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేతన్న బీమా, యారన్ సబ్సిడీ, త్రిఫ్ట్ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిరిసిల్ల టెక్స్టైల్స్ జోన్ ప్రెసిడెంట్ మంచె శ్రీనివాస్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, తెలంగాణ పవర్లూం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, నాయకులు పంతం రవి, కోడం రమణ పాల్గొన్నారు.