3 నుంచి డీఈఈసెట్ మూడో విడత కౌన్సెలింగ్
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో సీట్ల భర్తీకి మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 75 కాలేజీల్లో 4,700 సీట్లున్నాయి. మొదటి, రెండో విడతలలో 2,309 సీట్లే భర్తీ కాగా, 2,391 సీట్లు మిగిలాయి. ఈ సీట్ల భర్తీ ప్రక్రియ ఈ నెల 3 నుంచి ప్రారంభిస్తామని డీఈఈసెట్ కన్వీనర్ ఎస్ శ్రీనివాసచారి తెలిపారు.
మూతపడుతున్న కాలేజీలు
డీఈఐఈడీ, డీపీఎస్ఈ కోర్సులకు డిమాండ్ తగ్గింది. ఈ కోర్సుల్లో చేరేవారు లేక కాలేజీలు మూతపడుతున్నాయి. ఇటీవలికాలంలో 100 వరకు కాలేజీలను బంద్ చేశారు. 201920 వరకు రాష్ట్రంలో 173 కాలేజీలుండగా, 202021లో 100 కాలేజీలు, తాజాగా 75 కాలేజీలే నడుస్తున్నాయి. 201920లో ఈ కాలేజీల్లో 10,250 సీట్లుంటే, ఇప్పుడు 4,700 సీట్లే మిగిలి ఉన్నాయి. ఒకప్పుడు ఈ కోర్సులకు భలే డిమాండ్ ఉండేది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులను ఈ కోర్సులను పూర్తి చేసిన వారికే కేటాయించేవారు. దాంతో మేనేజ్మెంట్ కోటా సీట్లకు కూడా తీవ్ర డిమాండ్ ఉండేది.