హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): వర్షాల కారణంగా తెలంగాణలోని ఐదు జిల్లాల కలెక్టర్ల ముందుజాగ్రత్త చర్యల వల్ల భారీ ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగారని కేంద్ర ప్రతినిధి బృందం పేర్కొన్నది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సమావేశమైంది. ఈ నెల ఒకటి నుంచి గురువారం వరకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది.
ఈ బృందానికి నేతృత్వం వహించిన జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి మాట్లాడుతూ భారీ వర్షాలకు ఐదు జిల్లాల్లో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. వరి, పత్తి చేలు పూర్తిగా ధ్వంసమైనట్టు తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. మోరంచపల్లి, కొండాయి గ్రామాల్లో తీవ్ర ఆస్తినష్టం జరిగిందని తెలిపారు. విపత్తుల నివారణకు కేంద్ర ప్రతినిధి బృందం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని సీఎస్ తెలిపారు. సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, కేంద్ర ప్రతినిధి బృందం సభ్యులు అనిల్ గైరోలా, ఎస్కే కుష్వా, రమేశ్కుమార్, పొన్నుస్వామి, జే శ్రీనివాసులు, భవ్య పాండే పాల్గొన్నారు.