హైదరాబాద్, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ): అన్నం పెట్టే రైతుకు ఆసరాగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల ధరల పెంపుతో అన్నదాతల నడ్డి విరిచింది. డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచి రైతులను మరింత కుంగదీసింది. గత ఎనిమిదేండ్లలో డీజిల్ ధరను లీటర్కు రూ.40 వరకు పెంచింది. 2014 నవంబర్లో రూ.58.11 ఉన్న ఈ ధర ప్రస్తుతం రూ.97.82కి పెరగడంతో ట్రాక్టర్ వాడకం, వరి కోత ఖర్చులు రెట్టింపయ్యాయి. దీంతో రైతులకు వచ్చే ఆదాయం ఆవిరైపోతున్నది. గతంలో ట్రాక్టర్తో పొలాన్ని దున్నేందుకు గంటకు దాదాపు రూ.800 వరకు ఖర్చయ్యేది.
డీజిల్ ధర రెట్టింపవడంతో ఇప్పుడు ఆ ఖర్చు రూ.1,500 వరకు పెరిగింది. ప్రతి సీజన్లో పొలాన్ని సాగుకు సిద్ధం చేసి నాట్లు వేసే వరకు కనీసం మూడు సార్లు దుక్కి దున్నాల్సి ఉంటుంది. ఎకరం పొలాన్ని దున్నేందుకు సగటున 6 గంటల సమయం పడుతుంది. ఈ లెక్కన గతంలో ఎకరానికి రూ.4 వేలుగా ఉన్న దున్నకం ఖర్చు ఇప్పుడు రూ.5 వేలు పెరిగి రూ.9 వేలకు చేరింది. ఇదేవిధంగా వరి పంటను కోసేందుకు ఉపయోగించే హార్వెస్టర్ ఖర్చులు కూడా ఎగబాకాయి. గతంలో గంటకు రూ.1,400గా ఉన్న హార్వెస్టర్ చార్జి ఇప్పుడు రూ.2 వేలకు పెరిగింది. హార్వెస్టర్తో ఎకరం వరి పంటను కోసేందుకు గంటన్నర సమయం పడుతుంది. ఈ లెక్కన ప్రస్తుతం వరి కోతకు రూ.3 వేలు ఖర్చవుతున్నది. ఈ విధంగా గతంతో పోలిస్తే దున్నకం, వరి కోత చార్జీలు కలిపి ఎకరానికి రూ.6,600 పెరగడం గమనార్హం.
తెలంగాణలో రైతులు అత్యధికంగా సాగు చేసేది వరి పంటనే. కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో తెలంగాణతోపాటు అన్ని రాష్ర్టాల్లో వరి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డీజిల్, ఎరువుల ధరల పెరుగుదలతో వరి సాగు ఖర్చు రెట్టింపవడమే ఇందుకు కారణం. గతంలో ఎకరం వరి సాగుకు అన్ని ఖర్చులు కలిపి దాదాపు రూ.10 వేలు అయ్యేది. ఇప్పుడు అది రూ.20 వేలకు పెరిగింది. అయినా ధాన్యం మద్దతు ధరను పెంచడంలో కేంద్రం పిసినారితనాన్నే ప్రదర్శిస్తున్నది. 2014-15లో క్వింటాలుకు రూ.1,400గా ఉన్న గ్రేడ్-ఏ ధాన్యం మద్దతు ధర ప్రస్తుతం రూ.2,040గా ఉంది. అంటే గత ఎనిమిదేండ్లలో పెరిగింది రూ.640 మాత్రమే. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం.. ధాన్యం మద్దతు ధరను పెంచకుండా వ్యవసాయ ఖర్చులను పెంచుతుండటంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.