CERC | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తన అధికార పరిధి దాటి వ్యవహరిస్తున్నది. స్వయంప్రతిపత్తి గల సంస్థలపై కూడా అజమాయిషీ చెలాయించడానికి ప్రయత్నిస్తున్నది. తాజాగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ)ను తన గుప్పిట్లో పెట్టుకొనేందుకు మోదీ సర్కారు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ సీఆర్ఆర్సీకి ఈ నెల 8న ఓ లేఖ రాసింది. సీఈఆర్సీని బెదిరించేలా ఉన్న ఈ లేఖపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్వతంత్రంగా పనిచేసే సీఈఆర్సీకి జ్యుడీషియల్ అధికారాలు కూడా ఉన్నాయి. ఇది తీసుకొనే నిర్ణయాలను సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉన్నది. కానీ, కేంద్ర విద్యుత్తు శాఖ రాసిన లేఖలో.. ఎలక్ట్రిసిటీ చట్టం-2003లోని సెక్షన్ 178 ప్రకారం సీఈఆర్సీ దేశంలో విద్యుత్తుకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకొనే ముందు కేంద్ర విద్యుత్తు శాఖను తప్పకుండా సంప్రదించాలని సూచించింది. విద్యుత్తు నిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికే బీజేపీ ప్రభుత్వం ఈ లేఖ రాసిందని నిపుణులు అంటున్నారు. విద్యుత్తు అంశం రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్నది.
ఈ అంశంపై కేంద్రంతోపాటు రాష్ర్టాలకు కూడా చట్టాలు చేసే అధికారం ఉంటుంది. ఈ జాబితాలోని అంశాలపై కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకొనేముందు రాష్ర్టాలను సంప్రదించాలి. కానీ విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించడానికి కంకణం కట్టుకొన్న కేంద్రం, కొన్నేండ్లుగా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకొంటూ ఆదేశాలు జారీచేస్తున్నది. విద్యుత్తు ముసాయిదా చట్టం ఇందులో భాగమే. ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ తెలంగాణ సహా పలు రాష్ర్టాలు అసెంబ్లీల్లో తీర్మాణాలు చేసి కేంద్రానికి పంపించాయి.
అయినా వీటిని కేంద్రం పట్టించుకోలేదు. తాను చేయదల్చుకొన్నట్టుగానే దొంగచాటుగా ముందుకు సాగుతున్నది. తమ నిర్ణయాలను అమలుచేయాల్సిందేనంటూ రాష్ర్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేస్తున్నది. ఆ నిర్ణయాలు తీసుకొనేముందు మాత్రం రాష్ర్టాల అభిప్రాయాలను కోరడం లేదు. తాజాగా తనకు ఏమాత్రం అధికారం లేకపోయినా సీఈఆర్సీని అజమాయిషీ చేసేలా లేఖ రాసింది.