Railway Jobs | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రైల్వే ఉద్యోగాల భర్తీలో కేంద్ర ప్రభుత్వం చాలా ఏండ్ల నుంచి తెలుగు రాష్ర్టాల యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్నది. దేశంలో అత్యుతున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఉద్యోగాల భర్తీకే 13 ప్రాంతీయ భాషల్లో రాత పరీక్షలు నిర్వహిస్తుంటే.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ)ల ద్వారా భర్తీచేసే ఉద్యోగాలకు మాత్రం కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ఉద్యోగాలన్నీ ఉత్తరాదివారికే లభిస్తున్నాయి. రైల్వే ఉద్యోగాల్లో స్థిరపడాలన్న తెలుగు యువత ఆశలు నెరవేరడం లేదు. దీనిపై ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్ర ప్రభుత్వం గానీ, రైల్వే శాఖ మంత్రి గానీ పట్టించుకున్న పాపాన పోలేదు.
దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ల పరిధిలోని ఆర్ఆర్బీల ఆధ్వర్యంలో 5,696 అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. డిప్లొమా, ఇంజినీరింగ్ లాంటి టెక్నికల్ విద్యలు నేర్చుకున్న నిరుద్యోగ యువతను ఈ పోస్టుల్లో భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వీటిలో దాదాపు 750 పోస్టులు సికింద్రాబాద్ ఆర్ఆర్బీ పరిధిలో భర్తీ చేయనున్నారు. మెరిట్తోపాటు కంప్యూటర్ బేస్డ్ టెస్టులు, ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నప్పటికీ అసలైన రాత పరీక్షలను మాత్రం హిందీ, ఇంగ్లిష్లోనే నిర్వహిస్తున్నారు. అంటే హిందీ, ఇంగ్లిష్ భాషలు నేర్చుకున్నవారికే ఆర్ఆర్బీ ప్రాధాన్యమిస్తున్నది. దేశంలోని ఎన్నో మాతృ భాషలు ఉన్నప్పటికీ తప్పనిసరిగా హిందీ, ఇంగ్లిష్ భాషలను నేర్చుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నది. తద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, ఏపీ యువతకు రైల్వే ఉద్యోగాలు ఎన్నటికీ లభించవని కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెప్తున్నది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 19 రైల్వే జోన్లు ఉన్నాయి. వాటిలో 21 ఆర్ఆర్బీలు పని చేస్తున్నాయి. రైల్వే ఉద్యోగాల భర్తీకి ఈ బోర్డులన్నీ కేవలం హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దీంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ రైల్వే ఉద్యోగాలను భర్తీ చేసినా అవన్నీ ఉత్తరాదివారికే దక్కుతున్నాయి. తెలుగు యువతకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. దీనిపై దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ ఆరుణ్కుమార్ జైన్ను ‘నమస్తే తెలంగాణ’ ప్రశ్నించగా.. రైల్వే ఉద్యోగ పరీక్షలను తెలుగులో నిర్వహించే అంశం కేంద్రం చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను తెలుగులో రాసేందుకు అనుమతించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయినా రైల్వే బోర్డు మాత్రం దిగిరావడం లేదు. దీనిపై తెలుగు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు వెంటనే స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.