హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో 33 జిల్లాల ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఈవోలతో ఒక రోజు వర్క్షాప్ను రాష్ట్రస్థాయిలో శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈవీఎంల మొదటిదశ తనిఖీపై డీఈవోలకు అవగాహన కల్పించింది. ఈవీఎంలకు సంబంధించి విభిన్న సాంకేతిక అంశాలు, పరిపాలన భద్రతలు, కొత్త సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్యూ) ప్రదర్శన, మూల్యాంకనం తదితర అంశాలపై వివరణ ఇచ్చింది.
ఈసీఐఎల్కు చెందిన 16 మంది ఇంజినీర్ల సమక్షంలో ఈవీఎం, వీవీపాట్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇప్పించింది. ఈ వర్క్షాప్లో త్రిపుర, ఆంధ్రప్రదేశ్, అండమాన్, డామన్డయ్యూ, దాద్రానగర్ హవేలీ తదితర రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎలక్షన్ కమిషన్, ఈవీఎం నోడల్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక (డీఈఎంపీ), వ్యయ సు న్నిత నియోజకవర్గాల గుర్తింపు, ప్రమాదకరమైన, క్లిష్టమైన పోలింగ్ స్టేషన్ల జాబి తా తయారీని నిశితంగా పర్యవేక్షించాలని డీఈవోలకు సూచించారు.
జిల్లా స్థాయి లో అందుబాటులో ఉన్న మానవశక్తి డాటాబేస్ తయారీ, ఎన్నికల అన్ని అంశాలకు సంబంధించి 18 మంది నోడల్ అధికారులను నియమించాలని, పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్, ఇంటి నుంచి ఓటు వేయాల్సిన అవసరాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్ ఆగస్టు 2న, తుది రోల్ 4న ప్రకటిస్తుందని తెలిపారు. బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా ఇంటింటికీ ధ్రువీకరణ, ఇతర ప్రి రివిజన్ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సూచించారు.