హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం కేంద్ర విద్యాశాఖ పలు చర్యలు తీసుకొన్నది. అభ్యర్థుల్లో టెన్షన్ను దూరం చేసేందుకు టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్ల (టీపీసీ)ను ఏర్పాటు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్టీఏ)ని ఆదేశించింది. ముఖ్యంగా, గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని, వీటి నెట్వర్క్ను విస్తృతం చేయాలని సూచించింది. జేఈఈ మెయిన్ ప్రపంచంలోనే రెండో కఠినమైన పరీక్షగా ఇటీవలే నమోదైంది.
అత్యధికులు ఎన్నడూ అలవాటు లేని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో తొలిసారిగా పరీక్షలు రాయనున్నారు. దీంతో వారికి అనేక సందేహాలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్ల ఏర్పాటును కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ ఏడాది రెండు విడతల్లో జేఈఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి విడత 24 నుంచి 31 వరకు జరుగనున్నది. దరఖాస్తుల స్వీకరణ గడువు 12న ముగియనుండగా, అడ్మిట్కార్డులు మూడో వారంలో విడుదల కానున్నాయి.
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 రాత్రి 9 గంటల వరకు జేఈఈ రెండో విడత దరఖాస్తుకు ఎన్టీఏ అవకాశం ఇచ్చింది. ఫీజును మార్చి 7 రాత్రి 11 : 50 గంటల వరకు ఆన్లైన్లో చెల్లించవచ్చు. అడ్మిట్కార్డులను మార్చి చివరివారంలో విడుదల చేస్తారు. జేఈఈ -2 పరీక్షను ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహిస్తారు.