హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాక్సిన్ కొరతను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. తెలంగాణకు రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సా మర్థ్యం ఉన్నప్పటికీ టీకాలు అందుబాటులో లేక ఆదివారం వ్యాక్సినేషన్ నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రంతో మాట్లాడి ఆదివారం రాత్రికి 2.7 లక్షల డోసులు తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు. ఆదివారం బీఆర్కే భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. 25 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు విజ్ఞప్తిచేస్తే ఇప్పటివరకు స్పందన లేదన్నారు.
పడకల కొరత అబద్ధం
ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని, రాష్ట్రంలో 60 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. నాలుగైదు కార్పొరేట్ దవాఖానల్లో పడకల కొరత ఉంటే అన్నింటికీ దానిని ఆపాదించొద్దని హితవుపలికారు. వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నదని, మూడు రోజుల్లోనే లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం రోజుకు 260 టన్నుల ఆక్సిజన్ అవసరమని, రోగుల సంఖ్య పెరిగితే 300 నుంచి 350 టన్నులు అవసరమన్నారు. రోగులకు వైద్య అవసరాన్ని బట్టి ఆక్సిజన్ అందించాలని, చికిత్స ప్రొటోకాల్ పాటించాలని వైద్యులకు సూచించారు. మందులు, వ్యాక్సిన్ కొరత విషయంలో సీఎం కేసీఆర్ నిత్యం సమీక్షిస్తున్నారని తెలిపారు. రెమ్డెసివిర్ వంటి మందుల కొరత లేకుండా ఉండేలా ఆయా కంపెనీలతో ఇప్పటికే మాట్లాడామన్నారు. మన వద్దే తయారయ్యే మందులు, వ్యాక్సిన్ మనకు కొరత లేకుండా చూడాలని ఆయా కంపెనీలను, కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు.
ధైర్యమే అసలైన మందు
ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు ప్రజలకు ధైర్యం చెప్పి చికిత్స అందించాలని మంత్రి సూచించారు. రోగులను ఆందోళనకు గురిచేసేలా ప్రవర్తించకూడదని తెలిపారు. పాజిటివ్ వచ్చిన 95 శాతం మందికి దవాఖానలో చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటున్నారనే విషయాన్ని తెలియజేయాలని చెప్పారు. 80 శాతం మందిలో వైరస్ సోకినా ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని వివరించాలని, ఆక్సిజన్, రెమ్డెసివిర్ వంటి మందుల కంటే ధైర్యమే ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అవసరమైన ప్రతి ఒక్కరికీ చికిత్స అందించే సామర్థ్యం ప్రభుత్వ దవాఖానల్లో ఉన్నదని అన్నారు.