హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది హెల్త్ బడ్జెట్కు జీడీపీలో 0.35 శాతమే కేటాయించినట్టు కేంద్రం ఒప్పకున్నది. బడ్జెట్ కేటాయింపులపై తాజాగా లోక్సభలో సమాధానం ఇచ్చింది. ఈ ఏడాది కుటుంబ సంక్షేమశాఖ, ఆయుష్ విభాగం, హెల్త్ రిసెర్చ్ విభాగాలకు కలిపి రూ.92,802 కోట్లు కేటాయించినట్టు చెప్పింది. దేశ జీడీపీతో పోల్చితే కేటాయింపులు కేవలం 0.35 శాతమే. నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారం 2025 నాటికి హెల్త్ బడ్జెట్ను 2.5 శాతానికి పెంచుతామని కేంద్రం అప్పట్లో ప్రకటించింది.
కానీ ఇంకా రెండేండ్లు మాత్రమే మిగిలి ఉండగా.. 0.35 శాతం వద్దే లక్ష్యానికి చాలా దూరంగా ఆగిపోయింది. 2.5 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెండేండ్లలోనే హెల్త్ బడ్జెట్ను కనీసం ఏడు రెట్లు పెంచాల్సి ఉంటుంది. ఇది దాదాపు అసాధ్యం. రాష్ర్టాలు ఏటికేడు హెల్త్ బడ్జెట్ను కనీసం 10 శాతం పెంచాలని కేంద్రం సూచిస్తున్నది. కానీ.. నిరుటితో పోల్చితే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 3.9 శాతం నిధులను మాత్రమే పెంచింది.