హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఓక్రిడ్జ్ స్కూల్లో శనివారం నిర్వహించిన కాస్నివాల్ ఆకట్టుకున్నది. సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు హెడ్ ఆఫ్ ది కాస్నివాల్గా అదరగొట్టారు. క్రియేటివిటి, యాక్టివిటి, సర్వీస్ థీమ్తో ఏర్పాటు చేసిన ఈవెంట్లో భాగంగా 30కిపైగా స్టాళ్లతో విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, కాస్నివాల్ను ప్రారంభించారు. స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, నేటితరం పిల్లల ఆలోచనా విధానానికి ఈ కాస్నివాల్ ప్రతీక అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పలు రకాల ఇన్నోవేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హిమాన్షు సమాజానికి ఉపయోగపడే మంచి ఆలోచనలతో తన మిత్రబృందంతో కలిసి పని చేయడం సంతోషకరమని పేర్కొన్నారు.
తమ కాస్నివాల్ ఈవెంట్ పర్యావరణం, విద్యకు మధ్య వారధిలాంటిది అని ఓక్రిడ్జ్ స్కూల్ క్రియేటివిటి, యాక్టివిటి, సర్వీస్ (సీఏఎస్) ప్రెసిడెంట్గా కాస్నివాల్ను నిర్వహించిన హిమాన్షు పేర్కొన్నారు. కాస్నివాల్ ద్వారా సమకూరే డబ్బును నానక్రామ్గూడ చెరువు అభివృద్ధికి కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఈ కాస్నివాల్లో సినీహీరోలు నిఖిల్, కిరణ్ అబ్బవరం సందడి చేశారు.