హైదరాబాదాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ, గిరిజనుల సమగ్ర అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. గిరిపుత్రుల అభ్యున్నతే లక్ష్యంగా 2014-15 నుంచి బడ్జెట్లో రూ.కోట్లు కేటాయిస్తూ వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన గూడేలు, తండాలను గ్రామపంచాయతీలుగా చేయాలని చేసిన పోరాటాలు స్వరాష్ట్రంలో సాకారం అయ్యాయి. ఎవరూ అడగకపోయినా సీఎం కేసీఆర్ వాటిని గ్రామ పంచాయతీలుగా మార్చారు. 3,146 సర్పంచులు, 24,682 మంది వార్డు సభ్యులుగా గిరిజనులు పాలనలో భాగస్వామ్యమయ్యారు. రాష్ట్రంలో పెరిగిన ఎస్టీ జనాభాకు అనుగుణంగా 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారు. దీంతో వేల మంది గిరిజన యువకులకు లబ్ధి చేకూరుతున్నది. స్వరాష్ర్టంలో బీఆర్ఎస్ సర్కార్ గిరిపుత్రులు అన్ని రంగాల్లో ఎదిగేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ ద్వారా చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.
త్రీఫేజ్ కరెంట్
రాష్ట్రంలోని 3,467 గిరిజన ఆవాసాలకు రూ.221 కోట్ల ఖర్చుతో ప్రభుత్వం త్రీఫేజ్ విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించింది. ఫలితంగా గిరిజన ప్రాంతాల్లోని 2.4 లక్షల ఎకరాల భూమికి నిరంతరాయ విద్యుత్తు సరఫరా అందుబాటులోకి వచ్చింది. 1,01,000 గిరిజన కుటుంబాలకు 101 యూనిట్ల ఉచిత విద్యుత్తును సర్కారు అందిస్తున్నది.
అద్దంలా తండా రోడ్లు
రాష్ట్రంలో 500 జనాభా దాటిన 2,471 గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను గ్రామా పంచాయితీలుగా మార్చటంతో ‘మా తండాలో మా పాలన’ విధానంకొనసాగుతున్నది. దాంతో గిరిజన గ్రామపంచాయతీల సంఖ్య 3,146కు చేరుకొన్నది. ఒక్కో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.600 కోట్లు కేటాయించిందీ ప్రభుత్వం. అన్ని ప్రాంతాలు బీటీ రోడ్లతో అనుసంధానం అవుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం కల్పించడానికి ఇప్పటికే రూ.1,276 కోట్లు ఖర్చు కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించింది.
రిజర్వేషన్ల పెంపు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచటం ద్వారా గిరిజన విద్యార్థులకు 3,195 ఇంజనీరింగ్ సీట్లు, 189 మెడికల్ సీట్లు అదనంగా దక్కాయి. గ్రూప్-1, గ్రూప్-2, ఇతర విభాగాల్లో ఉద్యోగ నియామక భర్తీలో దాదాపు 903 పోస్టులు అదనంగా వచ్చి చేరనున్నాయి. స్టడీ సెంటర్ల ద్వారా ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందుతున్నది. ఇప్పటి వరకు 1,200 మంది గిరిజన విద్యార్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. గ్రూప్-1 మెయిన్స్కు 123 గిరిజన విద్యార్థులు ఎంపికయ్యారు. దేశంలో ఎకడాలేని విధంగా రాష్ట్ర సంక్షేమశాఖలో 1,650 పోస్టుల భర్తీ ప్రక్రియ నడుస్తున్నది.
పోడుకు త్వరలో పట్టాలు
రాష్ట్రంలో అర్హులైన గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలోనూ ప్రకటన చేశారు. 2006 అటవీ హకుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13కు ముందు వరకు సాగులో ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది.
ఎస్టీల అభ్యున్నతికి రూ.89,838.80 కోట్లు
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఏ సంవత్సరానికి కేటాయించిన నిధులు ఆ సంవత్సరానికే ఖర్చుచేయాల్సి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా.. ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు ఆ మరుసటి సంవత్సరానికి సైతం వినియోగించేలా చేసింది. దేశంలో ఇలా ప్రత్యేక చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణే.
గిరిజన ఆరాధ్యదైవంగా ముఖ్యమంత్రి కేసీఆర్
గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం ఎట్లా ఉంటుందో సీఎం కేసీఆర్ చూపించారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా గిరిజనుల కోసం తెలంగాణ ప్రభుత్వంలా చిత్తశుద్ధితో పనిచేయటం లేదనటానికి బడ్జెటే సాక్ష్యం. విద్య, ఉపాధి రంగాల్లో గిరిజన బిడ్డలకు రిజర్వేషన్లు పెంచి గిరిజన వికాసంలో సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచిగా నిలిచారు. రాష్ట్రంలోని గిరిజనులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ను తమ ఆరాధ్యదైవంగా కొలుస్తున్నారు.
-సత్యవతి రాథోడ్, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి