మహబూబ్నగర్ టౌన్, జూన్ 26: ‘నన్ను చదివించండి సార్’ అంటూ చేయి పట్టుకొని వేడుకొన్న ఓ బాలుడి బాధ్యత స్వీకరించారు ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్. చదువు పట్ల బాలుడి శ్రద్ధ, అతడి కుటుంబ పరిస్థితికి చలించిన మంత్రి.. బాలుడిని వెంటనే ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. అతడు జీవితంలో స్థిరపడే వరకూ తానే బాధ్యత తీసుకొంటానని ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని కాకర్లపాడ్ గ్రామానికి చెందిన మల్లెల వెంకటేశ్-బుజ్జమ్మ దంపతులకు కుమారుడు విజయ్కుమార్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం వద్ద కూల్డ్రింక్స్ అమ్ముతున్నాడు.
ఆదివారం ఫత్తేపూర్ మైసమ్మ ఆలయానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్గౌడ్ను చూసి దగ్గరకు వచ్చి తనకు చదువుకోవాలని ఉన్నదని చేయి పట్టుకొని ఏడుస్తూ చెప్పాడు. చదువుపై బాలుడికి ఉన్న శ్రద్ధను గమనించిన మంత్రి వెంటనే అతడి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. బాలుడికి మంచి భవిష్యత్ ఉన్నదని, మంచి పాఠశాలలో చదివిస్తానని చెప్పారు. జీవితంలో స్థిరపడే వరకూ ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తన వాహనంలోనే తీసుకెళ్లి విజయ్కుమార్ని పట్టణంలోని ఓ బడిలో చేర్పించారు. హాస్టల్ వసతి కల్పించాలని, ఖర్చంతా తానే భరిస్తానని సూచించారు. విజయ్కుమార్కు అవసరమైన దుస్తులు, ఇతర వస్తువులను సమకూర్చాలని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. బాలుడు తన వద్దకు వచ్చి అడిగిన విధానం, చదువు పట్ల బాలుడికి ఉన్న శ్రద్ధ తనను కదిలించిందని మంత్రి పేర్కొన్నారు. తమ బిడ్డ చదువుకు బాసటగా నిలిచిన మంత్రి శ్రీనివాస్గౌడ్కు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.