మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతు రాజు అయ్యాడు. రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించడం తట్టుకోలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ మీద కక్ష సాధింపు కోసం ఇక్కడి రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
రాజకీయంగా మనం ఏ స్థాయి నాయకుల అయినా ముందుగా రైతు బిడ్డలం. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాం. రైతు సంతోషంగా ఉంటే, రెండు పంటలు పండిస్తే దేశమంతా అందరూ కడుపు నిండా అన్నం తింటారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైంది. తెలంగాణ ఏర్పడితే ఇక్కడి రైతు సంతోషంగా ఉంటాడని, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో కేసీఆర్ ఉద్యమం చేపట్టి రాష్ట్రం సాధించారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అనతి కాలంలోనే దేశానికి అన్నపూర్ణగా మార్చారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్నాం. ఇదంతా ప్రతిపక్షాలకు నచ్చడం లేదన్నారు.
కేంద్రం తన తప్పు తెలుసుకుని తెలంగాణ రైతన్న పండించిన యాసంగి పంటను అంతా కొనేవరకు ఈ ఉద్యమం ఆగదన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు ఈ ఉద్యమం కొనసాగించాలని రైతు బిడ్డగా కోరుతున్నాను . బీజేపీ వ్యతిరేక దీక్ష మొదలైంది. ఓపిక ఉన్నంత వరకు, బీజేపీ కళ్లు తెరిచే వరకు దీనిని కొనసాగిస్తామన్నారు.
కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు, జెడ్పి చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్,ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు బాలాజీ నాయక్, టిఆర్ఎస్ నాయకులు నూకల శ్రీ రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.