జమ్మికుంట చౌరస్తా, అక్టోబర్ 3: క్షణం మలుగని కరెంటు.. పంట పెట్టుబడికి ఠంచనుగా సర్కారు సాయం.. తరగని సాగునీటి గలగలలు.. సీఎం కేసీఆర్ అకుంఠిత సంకల్పంతో రాష్ట్రంలో సాకారమైన కలలివి. ఈ సదుపాయాలే ఇప్పుడు తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చింది. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో రెండోస్థానంలో నిలిపింది. విత్తనోత్పత్తికి రాజధానిగా మార్చింది. ఇలా దినదిన ప్రవర్థమానమై ఎదిగిపోతున్న తెలంగాణపై కేంద్రప్రభుత్వం అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నది. నాలుగేండ్లకు సరిపడా నిల్వలున్నాయని చెప్తూ, రాష్ట్రం నుంచి వరిధాన్యం కొనేదిలేదని తెగేసి చెప్పటంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలున్నా, కేంద్రం ఉదాసీన వైఖరితో సాధ్యం కావడంలేదని బియ్యం వ్యాపారులు వాపోతున్నారు. దీంతో వందల రైస్మిల్లులు మూతపడి, వేలమంది ఉపాధికి ఉరి పడినట్టేననే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కీలక సమయంలో కేంద్రం కొర్రి
రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విత్తన వరిని విస్తృతంగా సాగు చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు విత్తన వరిని సాగు చేయించి నేరుగా సేకరించి ప్రాసెసింగ్ చేసి ఇతర రాష్ర్టాలు, విదేశాలకు కూడా సరఫరా చేస్తున్నారు. మిగతా పొలాల్లో పండిన ధాన్యాన్ని రైతులు రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. దీంతో అన్నదాతలకు కొన్నేండ్లుగా ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బంది రాలేదు. అంతా సక్రమంగా ఉందనుకొంటున్న సమయంలో వడ్లు కొనబోమని కేంద్రం తెగేసి చెప్పడం అన్నదాతలకు శరాఘాతంలా తాకింది. కరోనా నేపథ్యంలో మన బియ్యానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉన్నదని వ్యాపారులు చెప్తున్నారు. మన బియ్యం ఎగుమతికి కీలకమైన కాకినాడ పోర్టును కేంద్రం అభివృద్ధి చేయకపోవటంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇక్కడి నుంచి ప్రస్తుతం ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఎగుమతి చేసే వీలున్నది. మంచి సౌకర్యాలు కల్పిస్తే ఏటా రెండు లక్షల టన్నులు ఎగుమతి చేయొచ్చని అంటున్నారు. వియ త్నాం, థాయిలాండ్ దేశాలు బియ్యం ఎగుమతుల్లో ముందంజలో ఉన్నా, అక్కడి బియ్యం కంటే మన బియ్యం చవకగా దొరుకుతాయి. దాంతో విదేశీ వర్తకులు మన బియ్యం కోసం చూస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలు పెట్టించు రాజేంద్రా..
బీజేపీ నేత ఈటల రాజేందర్ రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని అనేకసార్లు డిమాండ్ చేశారు. బీజేపీలో చేరిన తర్వాత ఇప్పుడు ఆ ఊసే ఎత్తటంలేదని కరీంనగర్ జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోనే ఉన్నారు కదా? ప్రభుత్వాన్ని ఒప్పించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టించు అని డిమాండ్ చేస్తున్నారు.
వందల మిల్లులు మూతపడతాయి
కేంద్రప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనబోమని తెగేసి చెప్పడం విడ్డూరంగా ఉన్న ది. కేంద్రం వైఖరివల్ల కోట్ల రూపాయలుపెట్టి నిర్మించిన వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటాయి. అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రైస్ మిల్లులన్నీ మూతపడి, వేలమంది ఉపాధికి పోతుంది. ఇప్పటికైనా కేంద్రం వైఖరి మార్చుకోవాలి.
మూడు చట్టాలతో ముప్పు
కేంద్రప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు అనేక వ్యవస్థలకు ముప్పు తెచ్చాయి. ఇప్పటికే దడువాయి వ్యవస్థ పోయింది. ఎడ్ల బండ్ల కార్మికులు వెనక్కి పోయారు. హమాలీలు దెబ్బ తిన్నారు. రైతులు, రైతు కూలీలకు నష్టం తెచ్చిన ఈ చట్టం అవసరమా? బాయిల్డ్ రైస్ తీసుకోమని చెప్పి, ఇప్పుడు వేలమంది ఉపాధిని దెబ్బతీస్తుండ్రు. కేంద్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నది.
దొడ్డు వడ్లు కొనాల్సిందే
మన ప్రాంతలో దొడ్డు వడ్లు మాత్రమే ఎక్కువగా దిగుబడి వస్తాయి. అన్ని రోగాలకు తట్టుకొని నిలబడతాయి. వీటిని పండిస్తేనే మాకు లాభం. కేంద్రం ఇప్పుడు దొడ్డు వడ్లు కొనం అంటే రైతులంతా ఎటు పోవాలె? దొడ్డు వడ్లు కొనకుంటే ఇబ్బందులు తప్పవు. గిట్లయితే వచ్చే ఎన్నికల్లో ఓటేసుడే లేదు.
తగిన బుద్ధి చెబుతాం..
కష్టపడి రైతులు పండించిన అన్ని పంటలను కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలి. మాకు నచ్చిన పంటలే కొంటామని చెప్తే కుదరదు. గిట్లయితే వచ్చే ఉప ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదు. మేం మొత్తం వరి పంట మీదనే ఆధార పడి బతుకుతున్నం. మా వడ్లు కొనకుంట ఎట్ల వచ్చి ఊర్లళ్ల తిరుగుతరో సూద్దాం. రైతు సంక్షేమం కోసం పని చేస్తున్న టీఆర్ఎస్కే ఓటేస్తాం.