హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అన్ని ప్రాంతాల విద్యార్థులు, యువతకు సాంకేతిక అంశాల్లో మరింత అవగాహన కల్పించేందుకు మార్చి 12న ఎల్బీ స్టేడియంలో అతిపెద్ద యూత్ కార్నివల్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను శనివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సహకారంతో స్టమజ్ సంస్థ ప్రోస్ట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 17 నుంచి 25 ఏండ్ల వయసున్న యువత, విద్యార్థులు దాదాపు 15 వేలకు పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. యూత్ కార్నివాల్లో ఎమర్జింగ్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలతోపాటు ఇతర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం తెలిపారు.