జైపూర్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలు అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఓట్ల శాతం ఏమీ తగ్గలేదని ఆయన చెప్పారు. తాము ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యలపైన, అభివృద్ధిపైన మాట్లాడితే బీజేపీ బడా నేతలు మాత్రం అబ్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడంపైనే ఎక్కువ దృష్టి సారించారని అన్నారు.
మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై తాము త్వరలోనే ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) లో విశ్లేషణ చేస్తామని, ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకుంటామని గెహ్లాట్ చెప్పారు. కాగా ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీనిపై మీడియా పలుకరించగా గెహ్లాట్ పైవిధంగా స్పందించారు.